మధ్యంతరంలో ట్రంప్కు భారీ షాక్: 4గురు ఇండియన్ అమెరికన్లు మళ్లీ గెలిచారు
Recommended Video
వాషింగ్టన్: అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ మెజార్టీ స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. దీంతో రిపబ్లికన్ పార్టీకి చెందిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఇది భారీ ఎదురు దెబ్బ. బుధవారం మధ్యంతర ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి.
ట్రంప్కు షాక్: డెమొక్రటిక్ పార్టీకే పట్టం కట్టిన అమెరికన్లు
డెమోక్రటిక్ పార్టీ నుంచి నలుగురు ఇండియన్ అమెరికన్లు మళ్లీ విజయం సాధించారు. ఇందులో ఇల్లినాయిస్ 8వ కాంగ్రెస్సనల్ డిస్ట్రిక్ట్ నుంచి రాజా కృష్ణమూర్తి రెండోసారి గెలుపొందారు. 30 శాతానికి పైగా పాయింట్లతో స్పష్టమైన మెజార్టీతో గెలుపొందారు. ఇతను ఇండియన్ అమెరికన్ రిపబ్లికన్ అభ్యర్థి జేడీ దిగాన్వేకర్ను ఓడించారు.
వరుసగా నాలుగోసారి అమీబేరా గెలుపు
కాలిఫోర్నియా జిల్లాలోని సెవెంత్ కాంగ్రెస్సనల్ నుంచి డాక్టర్ అమీబేరా నాలుగోసారి గెలుపొందారు. వరుసగా నాలుగోసారి గెలిచి రికార్డ్ సృష్టించారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ఆండ్రూ గ్రాంట్ను ఐదు శాతం స్వల్ప మెజార్టీతో ఓడించారు.
రో ఖన్నా గెలుపు
సిలికాన్ వ్యాలీలో ఇండియన్ అమెరికన్ రో ఖన్నా గెలుపొందారు. ఇతను రిపబ్లికన్ అభ్యర్థి రోన్ కోహెన్ పైన 44 శాతం భారీ పాయింట్లతో విజయం సాధించారు. కాలిఫోర్నియాలోని 17వ కాంగ్రెస్సనల్ డిస్ట్రిక్ట్ నుంచి అద్భుత విజయం సాధించారు. ఈ గెలుపుపై రో ఖన్నా ఆనందం వ్యక్తం చేశారు. తనకు అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని, ఇది తనకు ఇచ్చిన గౌరవం అన్నారు.
ప్రమీలా జయపాల్ గెలుపు
గ్రెస్ వుమెన్ ప్రమీలా జయపాల్ (ఇండియన్ అమెరికన్) రిపబ్లికన్ అభ్యర్థి క్రెయిగ్ కెల్లర్ను ఓడించారు. ఈమె 66 శాతం పాయింట్లతో ఓడించారు. మధ్యంతర ఎన్నికల్లో అమెరికన్లు డెమోక్రాట్లకు పట్టం గట్టారని, తిరిగి తమను కోరుకుంటున్నారని, హౌస్లో తమకు బలం ఇఛ్చారని ప్రమీలా జయపాల్ అన్నారు. అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడుతామన్నారు.
గట్టిపోటీ ఇచ్చిన పలువురు ఇండియన్ అమెరికన్లు
దాదాపు అరడజను మంది ఇండియన్ అమెరికన్ అభ్యర్థులు ప్రత్యర్థులకు గట్టిపోటీ ఇచ్చారు. పైవన్నీ మన లోకసభ నియోజకవర్గాల లాంటివి. రాష్ట్రాలలోను ఇండియన్ అమెరికన్లు సత్తా చాటారు. విస్కాన్సిన్ రాష్ట్రంలో డెమోక్రటిక్కు చెందిన ఇండియన్ అమెరికన్ జోష్ కౌల్ తొలిసారి అటార్నీ జనరల్ గెలిచే రేసులో ముందున్నారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన బ్రాడ్ సిమెల్ను ఓడించడం ద్వారా రేసులో ముందున్నారు.
రాష్ట్రాలలోను గెలుపు
స్టేట్ డిస్ట్రిక్ట్ 40 నుంచి కెంట్రకీ అసెంబ్లీ నుంచి డెమోక్రటిక్ నిమా కులకర్ణి రిపబ్లికన్కు చెందిన జోషువా న్యూబర్ట్ను ఓడించారు. డిస్ట్రిక్ట్ 24 నుంచి అమీష్ షా గెలుపొందారు. న్యూయార్క్ సెనెడ్ డిస్ట్రిక్ట్ 6 నుంచి కెవిన్ థామస్ గెలిచారు. సెనేట్ డిస్ట్రిక్ట్ 38 నుంచి ముజ్తాబ్ మొహమ్మద్ గెలిచారు. స్టేట్ సెనెట్ డిస్ట్రిక్ట్ 15 నుంచి జయ్ చౌదరి గెలిచారు. నీరజ్ అటానీ (ఓహియో, హోస్ 42 డిస్ట్రిక్ట్) ఇలా మరికొందరు ఇండియన్ అమెరికన్లు గెలిచారు.
మెజార్టీ స్థానాలు గెలుచుకున్న డెమోక్రటిక్ పార్టీ
కాగా, అమెరికాలో కీలకమైన మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ మెజర్టీ స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రతినిధుల సభ(హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్)లో ప్రతిపక్ష డెమోక్రటిక్ మెజార్టీ సీట్లను సాధించింది. సెనేట్లో రిపబ్లికన్ పార్టీ ఎట్టకేలకు తమ ఆధిక్యాన్ని నిలుపుకుంది. రిప్రజెంటేటివ్స్ హౌస్, సెనేట్ను కలిపి అమెరికా కాంగ్రెస్గా వ్యవహరిస్తారు. ప్రతినిధుల సభలో 435 స్థానాలకు, సెనేట్లోని మొత్తం 100 స్థానాల్లో 35 సీట్లకు పోలింగ్ జరిగింది. 36 రాష్ట్రాల గవర్నర్ పదవులకు, ఇతర పలురకాల పదవులకు కూడా ఎన్నికలు జరిగాయి. ఎక్కువ స్థానాల్లో డెమోక్రాట్లు విజయం సాధించారు.