క్రమ‘శిక్ష’ణ: విద్యార్థులను సూదులతో గుచ్చారు
బీజింగ్: కొందరు ఉపాధ్యాయులు విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దేందుకు తమ జీవితాన్ని త్యాగం చేస్తుంటే.. మరికొందరు విద్యార్థుల పట్ల కర్కశంగా ప్రవర్తించి వారిపాలిట శాపంగా మారుతున్నారు. ఇలాంటి ఘటనే చైనాలో చోటు చేసుకుంది. తమ మాట వినడం లేదనే కోపంతో కొందరు టీచర్లు.. విద్యార్థులను సూదులతో గుచ్చారు.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. జిలిన్ రాష్ట్రంలోని సైపింగ్ నగరంలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయులు క్రమశిక్షణ నెపంతో 20 మంది కిండర్గార్డెన్ చిన్నారులను గత కొంతకాలంగా సూదులతో గుచ్చి హింసించారు.
చిన్నారుల శరీరంపై ఎర్రటి సూది గుర్తులను చూసిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు ఉపాధ్యాయులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో ఓ చిన్నారి శరీరంపై 50 సూది పోట్లు ఉన్నట్లు ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది. దీంతో ఘటనకు సంబంధించి నలుగురు ఉపాధ్యాయులను అరెస్టు చేసి.. దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.