షాక్: ఫ్రీజర్లో 40 పులి పిల్లల మృతదేహాలు
బ్యాంకాక్: థాయిలాండ్లోని ఓ ఆలయంలో సుమారు 40 పులి పిల్లల మృతదేహాలను అధికారులు గుర్తించారు. ఈ వార్త స్థానికంగా సంచలనంగా మారింది. కాంచనబూరీ రాష్ట్రంలోని టైగర్ టెంపుల్ ఫ్రీజర్లో ఆ పసి కూనలను గుర్తించారు. పులులను అక్రమంగా తరలిస్తున్నారని థాయ్లాండ్పై ఆరోపణలు రావడంతో అధికారులు దాడులను తీవ్రం చేశారు.
బ్యాంకాక్కు పశ్చిమ దిశగా కాంచన్బూరిలో ఉన్న బౌద్ధ ఆలయంలో పులుల సంరక్షణ కేంద్రం ఉంది. విదేశీ టూరిస్టులు ఆ పులుల్ని చూసేందుకు వేలాదిగా వస్తుంటారు. అయితే ఆ ఆలయం కేంద్రంగా అంతర్జాతీయ ట్రాఫింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు కూడా విస్తృతంగా వినిపిస్తున్నాయి.
ఔషధాల తయారీ కోసం చైనీయులు పులుల శరీర భాగాలను ఎక్కువగా వాడుతుంటారు. అయితే ఆలయ కిచెన్లో ఉన్న ఫ్రీజర్లో పులి కూనలు ఉన్నట్లు గుర్తించారు. కాంచన్బూరిలో పులుల ఆలయం నుంచి ఇప్పటికే అధికారులు 52 జంతువులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా, ఆలయ అధికారులు మాత్రం ఎలాంటి అక్రమాలకు పాల్పడటం లేదని చెబుతున్నారు.