టెహ్రాన్లో కూలిన విమానం, క్రూ సహా 48మంది మృతి
టెహ్రాన్: మరో విమానం కూలిపోయింది. ఈ విమానం కూలిన ఘటనలో నలభై మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సమీపంలోని మెహరాబాద్ విమానాశ్రయంలో ఓ విమానం కూలిపోయింది. ఈ దారుణ ఘటనలో విమానంలో ఉన్న మొత్తం 40 మంది ప్రయాణీకులు చనిపోయారు.
విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే ఈ దారుణం సంభవించింది. ఇంజిన్ ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణమని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారిలో ఏడుగురు చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
కాగా, ఇరానియన్ స్టేట్ టెలివిజన్ 48 మంది చనిపోయినట్లుగా తెలిపింది. చనిపోయిన వారిలో 40 మంది ప్రయాణీకులు, 8 మంది క్రూ మెంబర్స్ ఉన్నారని తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం గం.9.20 నిమిషాలకు కుప్పకూలింది.
కూలిన విమాం ఇరాన్ 140 జెట్. ఈ విమానాన్ని సాధారణంగా షార్ట్ డొమెస్టిక్ ఫ్లైట్గా వినియోగిస్తారు. మూడేళ్ల క్రితం.. అంటే జనవరి 2011లో చివరిసారి ఇరాన్లో ఓ విమానం క్రాష్ అయింది. ఈ ఘటనలో 77 మంది వరకు మృతి చెందారు.