తుఫాన్ దెబ్బ: 400 విమానాలు రద్దు
టోక్యో: జపాన్ రాజధాని టోక్యో నగర ప్రజలు భారీ తుఫాను (టైపూన్ మిండుల్లే) వస్తుందని తెలుసుకుని వణికిపోతున్నారు. సోమవారం భారీ ఈదురుగాలులు టోక్యో నగరాన్ని తాకుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 400 విమాన సర్వీసులు, బుల్లెట్ ట్రైన్ సర్వీసులు రద్దు చేశారు.
టోక్యో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. టోక్యో నుంచి ఉత్తర తొహుకు ప్రాంతం దిశగా టైపూన్ మిండుల్లే ప్రభావం చూపుతుందని జపాన్ వాతావరణ శాఖ వెల్లడించింది.
ఈ భారీ తుఫాను సందర్బంగా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ సందర్బంలో దేశ వ్యాప్తంగా 400 విమాన సర్వీసులు రద్దు చేస్తున్నామని అధికారులు చెప్పారు.
టోక్యోలోని హనెడ విమానాశ్రయంకు విమానాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. 145 దేశీయ విమాన సర్వీసులు రద్దు చేశామని జపాన్ ఎయిర్ లైన్స్ వెల్లడించింది. ఆల్ నిప్పన్ ఎయిర్ వేస్ సైతం 90 విమాన సర్వీసులు రద్దు చేసింది.
400 విమానాలు రద్దు కావడంతో దాదాపు 48 వేల మంది విమాన ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతుందని అధికారులు చెప్పారు. టోక్యో నగరంలో భారీ తుఫాను సందర్బంగా ఈదురుగాలులు, వరదల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. టోక్యో నగరంలో బుల్లెట్ ట్రైన్ సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి.