400 తిమింగలాలు ఒకేసారి... ఎందుకిలా? ఏం జరిగుంటుంది?
న్యూజిలాండ్ లోని ఓ బీచ్ లో 400లకు పైగా తిమింగలాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. వీటిలో 70 శాతం మృత్యువాత పడ్డాయి.
న్యూజిలాండ్: న్యూజిలాండ్ లోని ఓ బీచ్ లో 400లకు పైగా తిమింగలాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. వీటిలో 70 శాతం మృత్యువాత పడ్డాయి. ఎందుకిలా జరిగిందో.. ఒకేసారి అన్ని తిమింగలాలు ఒడ్డుకు ఎందుకు కొట్టుకొచ్చాయో తెలియదు.
గోల్డెన్ బే రీజియన్ లోని ఫేర్ వెల్ స్పిట్ వద్ద 416 తిమింగలాలు ఇలా ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. ఈ విషయం తెలిసిన అటవీ అధికారులు అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే వాటిలో దాదాపు 300కుపైగా తిమింగలాలు ప్రాణాలు విడిచాయి.
మిగిలిన వాటినైనా సముద్రంలోకి తిరిగి పంపేందుకు 500 మంది వలంటీర్లను రంగంలోకి దిగారు. దాదాపు రెండు టన్నుల బరువు, 20 అడుగుల పొడవు వరకు పెరిగే తిమింగలాలు న్యూజిలాండ్ సముద్ర జలాల్లో ఎక్కువగా కనిపిస్తాయి.
సాధారణంగా ఇలా తిమింగలాలు ఒడ్డుకు కొట్టుకొచ్చినప్పడు వాటి సహచర తిమింగలాలు కూడా వస్తాయి. తిరిగి అన్నీ కలిసి ఈదుకుంటూ మళ్లీ సముద్రంలోకి వెళ్లపోతాయి. అయితే ఇప్పుడు మాత్రం ఇలా జరగలేదు.
బహుశా అవి ఒడ్డుకు కొట్టుకొచ్చిన క్రమంలో ఇసుకలో బాగా లోతుగా కూరుకుపోయి ఉంటాయని, అందుకే తిరిగి సముద్రంలోకి వెళ్లలేకపోయి ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
1918లో కూడా చేతమ్ దీవి వద్ద ఇలా 1000 తిమింగలాలు ఒకేసారి ఒడ్డుకు వచ్చి మృత్యువాత పడ్డాయి. 1985లో ఆక్లాండ్ లోని తీరంలో కూడా ఇలాగే 450 తిమింగలాలు ఒకేసారి మరణించాయి. మళ్లీ ఆ తరువాత ఇంత పెద్ద మొత్తంలో తిమింగలాలు మృతి చెందడం ఇదే మొదటిసారి.