గల్వాన్ ఘటనలో 45 మంది చైనా సైనికుల మృతి ? రష్యా న్యూస్ ఏజెన్సీ సంచలనం
గతేడాది జూన్లై భారత్-చైనా సరిహద్దుల్లోని గల్వాన్ ప్రాంతంలో జరిగిన ఘర్షణల్లో ఇరుదేశాలకు చెందిన ఎంతమంది సైనికులు చనిపోయారన్న దానిపై భిన్నకథనాలు వినిపించాయి. భారత్ మాత్రం తమ దేశానికి చెందిన 20 మంది సైనికులు చనిపోయారని స్పష్టమైన ప్రకటన చేస్తే డ్రాగన్ దేశం మాత్రం ఆ వివరాలను వెల్లడించేందుకు ఇష్టపడలేదు. అయినా అక్కడ ప్రత్యక్ష సాక్ష్యులుగా ఉన్న మన సైనికులు మాత్రం చైనాకు చెందిన 30 మంది వరకూ చనిపోయి ఉండొచ్చని భావించారు. కానీ అంతకంటే ఎక్కువ మందే చనిపోయారంటూ రష్యాకు చెందిన ఓ న్యూస్ ఏజెన్సీ సంచలన కథనం ప్రచురించింది.
గల్వాన్లో ఏం జరిగింది?
భారత్-చైనా సరిహద్దుల్లో ఉన్న గల్వాన్ ప్రాంతంలో ఇరుదేశాల సైనికుల మధ్య భారీ ఘర్షణ చోటు చేసుకుంది. అయితే ఈ ప్రాంతంలో సైనికులు ఆయుధాలు కలిగి ఉండటంపై నిషేధం ఉండటంతో ఇరుదేశాల సైనికులు ముష్టిఘాతాలతో పరస్పరం విరుచుకుపడ్డారు. ఒకరిపై ఒకరు చేతులతోనే దాడులు చేసుకున్నారు. మల్లయుద్ధాన్ని తలపించిన ఈ ఘటనలో భారత్కు చెందిన 20 మంది సైనికులు చనిపోయారు. ఇందులో హైదరాబాద్కు చెందిన కల్నల్ సంతోష్ కుమార్ కూడా ఉన్నారు. దీంతో ఈ వ్యవహారాన్ని ఇరుదేశాలూ సీరియస్గా తీసుకున్నాయి.
మృతుల సంఖ్యను దాచేసిన చైనా
గల్వాన్ ఘటనలో తమ సైనికులు 20 మంది చనిపోయారని భారత్ స్పష్టమైన ప్రకటన చేయగా.. చైనా మాత్రం అటువంటి ప్రకటనేదీ చేయలేదు. ఆ తర్వాత గల్వాన్లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన 34 మంది గాయపడినట్లు అమెరికా నిఘా ఏజెన్సీ వర్గాలు తలిపాయి.
దీనిపై వ్యాఖ్యానించేందుకు కూడా భారత్లో చైనా రాయబారిగా ఉన్న సన్ వీల్డింగ్ నిరాకరించారు. ఈ వివరాల వెల్లడి వల్ల సరిహద్దుల్లో పరిస్ధితులు మెరుగుపడవంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. అయితే వాస్తవంగా గల్వాన్లో చైనా సైనికులలు ఎంతమంది చనిపోయారన్న దానిపై వివరాలు గోప్యంగానే ఉండిపోయాయి. దీంతో ఎవరి లెక్కలు వారు చెప్పుకుంటున్నారు.
45 మంది మృతి చెందారంటున్న రష్యా ఏజెన్సీ
వాస్తవానికి గల్వాన్లో భారత్-చైనా మధ్య జరిగిన ఘర్షణలో ఎంత మంది సైనికులు చనిపోయారన్న దానిపై తాజాగా రష్యాకు చెందిన న్యూస్ ఏజెన్సీ టాస్ ఓ సంచలన కథనం ప్రచురించింది. దీని ప్రకారం ఈ ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులతో పాటు 45 మంది చైనా సైనికులు చనిపోయారు. కానీ ఈ వివరాలు బయటపెడితే అంతర్జాతీయంగా పరువు పోతుందని భావించి చైనా దాచేసినట్లు తెలుస్తోంది.
అయితే ఆ కోపాన్ని తర్వాత భారత్తో జరిగిన చర్చల ప్రక్రియపై ప్రదర్శించింది. దీంతో ఇంతకాలంగా చర్చల ప్రక్రియ ముందుకు సాగలేదని తెలుస్తోంది. తాజాగా నిన్నటి నుంచి భారత్-చైనా ఒప్పందం ప్రకారం బలగాల ఉపసంహరణ కొనసాగుతోంది.