టెక్సాస్లో కాల్పులు: ఐదుగురు మృతి, 21మందికి తీవ్రగాయాలు
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. శనివారం టెక్సాస్లో ఓ ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, 21మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ముగ్గురు పోలీసు అధికారులు కూడా కాల్పుల్లో గాయపడినట్లు ఒడెస్సా చీప్ మైకేల్ గెర్క్ మీడియాకు తెలిపారు.
ట్రాఫిక్ నిలిచిపోయిన సమయంలో దుండగుడు కాల్పులకు తెగబడినట్లు సదరు అధికారి తెలిపారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడు కూడా హతమయ్యాడని చెప్పారు. మరో నిందితుడు తప్పించుకున్నాడని తెలిపారు.
ట్రాఫిక్ నిలిచిన సమయంలో దుండగుడు వాహనాల చుట్టూ తిరుగుతూ కాల్పులు జరిపాడని తెలిపారు. ఒడెస్సా-మిడ్లాండ్ లను కలిపే 20వ ఇంటర్ స్టేట్ హైవేలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సాయుధులైన దుండగులు ఎవరూ లేరని చెప్పారు.
టొయోటా వాహనంలో వచ్చిన ఇద్దరు దుండగులు మొదట యూఎస్ పోస్టల్ వ్యాన్ని దొంగలించిరాని, అదే వ్యాన్లో ఘటనా స్థలానికి చేరుకుని ఈ ఘోరానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో పోలీసులు భారీగా చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
కాగా, ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎఫ్బీఐ, ఇతర సంస్థలతో ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. ఇలాంటి దాడులు మూర్ఖపు చర్యలేననని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబోత్ వ్యాఖ్యానించారు.
కాగా, ఇటీవల వాల్ మార్ట్ వద్ద ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో 21మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అమెరికాలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. దీంతో అక్కడి ప్రజల్లో కొంత ఆందోళన నెలకొంది. కొందరు దుండగులు రక్షణ కోసం తీసుకున్న ఆయుధాలను ఇలా ప్రాణాలు తీయడానికి వాడుతుండటం విచారకరం.