బంగ్లాలో మరోసారి పేలుళ్లు: పోలీస్తోపాటు 4గురు మృతి
ఢాకా: దేశమంతా రంజాన్ పర్వదినం జరుపుకుంటుండగా ఉగ్రవాదులు బంగ్లాదేశ్లో మరోసారి పేలుళ్లకు పాల్పడ్డారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు 100కిలోమీటర్ల దూరంలోని కిశోర్ గంజ్ ప్రాంతంలో గురువారం ఉదయం ప్రార్థనలు చేసుకుంటుండగా ఉగ్రవాదులు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు.
ఢాకా కిరాతకం: 20మంది గొంతుకోసి చంపేశారు, 13ని.లో ఉగ్రవాదుల అంతం
పోలీసు కాన్వాయ్ లక్ష్యంగా బాంబులు వేసినట్లు తెలుస్తోంది. ఈ పేలుళ్ల కారణంగా ఓ పోలీసు అధికారితోపాటు ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 15మంది పౌరులు తీవ్ర గాయాలపాలయ్యారు.
కాగా, ఈ దాడి జరిగిన సమయంలో ఈద్గా మైదానంలో దాదాపు 3 లక్షల మంది ప్రార్ధనలు చేస్తున్నారు. దాడి జరిపిన అనంతరం ఆగంతకులు అక్కడే ఉన్న ఓ ఇంట్లో తలదాచుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
పేలుడు ఘటనను బంగ్లాదేశ్ సమాచారశాఖ మంత్రి హసనుల్హక్ ధ్రువీకరించారు. కిషోర్గంజ్లో ముష్కరులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. కాగా, ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు.
ఘటనపై సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై బంగ్లా ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై విచారణకు ఆదేశించారు.
కాగా, గత శుక్రవారం కూడా ఢాకాలోని ప్రఖ్యాత హోలీ ఆర్టిసన్ కేఫ్లో ఉగ్రవాదులు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఓ భారత యువతీతోపాటు 20మందిని ఉగ్రవాదులు గొంతుకోసి దారుణంగా హతమార్చారు. మరో ఇద్దరు పోలీసులు కూడా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయారు.