హౌడీ , మోదీ అంటూ 50వేల మందితో హోరెత్తిన ఈవెంట్
భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ప్రవాస భారతీయులలో మంచి జోష్ నింపింది. హ్యూస్టన్లోని ఎన్ఆర్జీ స్టేడియంలో జరిగిన 'హౌడీ మోడీ' కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ఆయనతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వేదికను పంచుకున్నారు. ప్రవాస భారతీయులతో ఎన్ఆర్జీ స్టేడియం క్రిక్కిరిసిపోయింది. మోడీ, మోడీ, భారత్ మాతాకీ జై వంటి నినాదాలతో స్టేడియం ప్రాంగణమంతా హోరెత్తిపోయింది.
50 వేల మందికి పైగా ప్రవాస భారతీయులలో మోదీరాకతో ఉత్సాహం
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ టెక్సాస్ లోని హ్యూస్టన్ లో ఎన్ఆర్జీ స్టేడియంకు రాగానే 50 వేల మందికి పైగా ప్రవాస భారతీయులు మోడీ రాకతో కరతాళధ్వనులు చేశారు. అంతులేని ఉత్సాహంతో మోడీని పలకరించారు. మోడీ , మోడీ అంటూ నినాదాలు చేశారు. భారత్ మాతాకీ జై అంటూ తమ దేశభక్తిని చాటుకున్నారు. తన ప్రసంగం కోసం అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని పలకరింపుగా మోడీ అక్కడ ప్రవాస భారతీయుల నుద్దేశించి చేతులు జోడించి నమస్కరించారు.
దేశీ ప్రదర్శనలతో హోరెత్తిన హౌడీ మోడీ సభ
చాలా అద్భుతమైన దేశీ ప్రదర్శనలతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. హౌడీ మోడీ భారీ బహిరంగ సభ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ప్రవాస భారతీయులలో మోడీ ప్రసంగం ఏ విధంగా ఉంటుంది అన్న ఉత్సుకత అడుగడుగునా కనిపించింది. అయితే ఈ కార్యక్రమానికి హైలెట్ మాత్రం పీఎం మోడీ ప్రసంగం. మోడీ రాకతో ప్రవాస భారతీయుల కేరింతలతో ఎన్ఆర్జీ స్టేడియం దద్దరిల్లింది.
అమెరికాలో పోప్ మినహా విదేశీ ప్రభుత్వాధినేతల్లో ఇంత భారీ సభ ఇదే
అమెరికాలోని 50 రాష్ట్రాలకు చెందిన సెనేటర్లు, గవర్నర్లు, మేయర్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరితో పాటు 650 కంపెనీల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. అమెరికాలో పోప్ మినహా విదేశీ ప్రభుత్వాధినేతల్లో ఇంత భారీ సభలో ప్రసంగించడం ఇదే తొలిసారి. హ్యూస్టన్ లో జరిగిన ఈ సభను భారత దేశమంతా ఆసక్తికరంగా తిలకించింది. ప్రవాస భారతీయులలో భారత దేశం పట్ల, కానీ నరేంద్ర మోడీ పట్ల ఉన్న క్రేజ్ కు భరతజాతి సంతోషించింది.