బ్రెజిల్లో దారుణం.. జైలులో చెలరేగిన అల్లర్లు.. 57మంది మృతి
బ్రెజిల్ దారుణం జరిగింది. జైలులో రెండు వర్గాలకు చెందిన ఖైదీల మధ్య జరిగిన ఘర్షణలో 57మంది మృతి చెందారు. చిన్న తగాదాతో మొదలైన ఘర్షణ చినికి చినికి గాలి వానగా మారింది. ఖైదీల పరస్పర దాడిలో 16మంది తలలు తెగిపడ్డాయి. ఖైదీలు జైలులో మంట పెట్టడంతో ఊపిరాడక పలువురు చనిపోయారు.
అల్టమీరా ప్రాంతంలోని జైలులో ఉదయం 7గంటల సమయంలో రెండు గ్యాంగుల మధ్య ఘర్షణ మొదలైంది. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 16మంది తలలు నరికివేశారు. కమాండో వెర్మిల్హో, కమాండో క్లాస్ ఏ గ్రూపులకు చెందిన ఖైదీలు రెచ్చిపోయారు. కమాండో ఏ గ్రూపు సభ్యులు కమాండో వెర్మిల్హో గ్రూప్ మెంబర్లున్న సెల్కు నిప్పుపెట్టారు. అది వేగంగా విస్తరించడంతో మంటలు జైలు అంతటా వ్యాపించాయి. అందులో చిక్కుకుని పలువురు ఖైదీలు చనిపోయారు.
అల్లర్లలో భాగంగా ఖైదీలు ఇద్దరు గార్డులను నిర్భంధించారు. మధ్యాహ్నం వారిని విడిచిపెట్టారు. అధికారులు అదనపు పోలీస్ బలగాలను రప్పించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మృతి చెందిన ఖైదీల్లో 16 మంది కొన్ని నెలల క్రితం మరో జైలులో జరిగిన భారీ హింస నేపథ్యంలో ఇక్కడకు తరలించారు. అమెరికా, చైనా తర్వాత బ్రెజిల్ జైళ్లలో ఖైదీల సంఖ్య ఎక్కువగా ఉంది. కొంత కాలంగా అక్కడి జైళ్లలో గ్రూపుల మధ్య ఘర్షణలు, హింసాత్మక ఘటనలు తరచూ చోటు చేసుకున్నాయి.