భయానక కరోనా వైరస్ బారిన పడిన ఫస్ట్ పేషెంట్ ఎవరో తెలుసా?: వుహాన్ ఫిష్ మార్కెట్..రొయ్యల వ్యాపారి..!
బీజింగ్: ఈ భూమండలాన్ని మట్టుబెట్టేలా చుట్టబెట్టి పారేసిన భయానక కరోనా వైరస్కు మూలం ఎక్కడో తెలిసిపోయింది. చైనాలోని హ్యూబే ప్రావిన్స్లో గల వుహాన్ సిటీ ఈ వైరస్కు పుట్టినల్లు అనే విషయం తెలిసినప్పటికీ.. మొట్టమొదటిసారిగా ఆ వైరస్ ఎవరిలో ప్రవేశించిందనే విషయం ఇఫ్పటిదాకా వెలుగు చూడలేదు. మొదటిసారిగా ఈ వైరస్ బారిన ఎవరు పడ్డారనేది ఇన్నాళ్లూ అంతుచిక్కని ప్రశ్నలా ఉంటూ వచ్చింది. ఎట్టకేలకు దాన్ని ఛేదించారు డాక్టర్లు. ట్విస్ట్ ఏమిటంటే- ఈ తొలి పేషెంట్ జీవించే ఉన్నారు. కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్నారు.
వుహాన్ ఫిష్ మార్కెట్లో.. రొయ్యలు అమ్మే మహిళకు
వుహాన్ సిటీలోని హ్యూనన్ ఫిష్ మార్కెట్లో తొలిసారిగా ఈ వైరస్ జాడలు కనిపించాయి. ఈ మార్కెట్లో రొయ్యలను విక్రయించే ఓ మహిళా వ్యాపారి ఈ వైరస్ బారిన పడిన మొట్టమొదటి పేషెంట్గా గుర్తించారు. వైరస్ సోకిన తొలిరోజుల్లో ఆమె జలుబుతో బాధపడ్డారని తేలింది. క్రమంగా దగ్గు, జ్వరంతో ఆసుపత్రి పాలయ్యారని తేలింది. ఈ విషయాన్ని అమెరికా, లండన్కు చెందిన వాల్స్ట్రీట్ జర్నల్, మిర్రర్ యూకే వెల్లడించాయి. ఆమెను పేషెంట్ నంబర్ జీరోగా నిర్ధారించినట్లు పేర్కొన్నాయి. దీనిపై ఆ దినపత్రిక ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
సాధారణ జ్వరంగా.. డిసెంబర్ 10వ తేదీన
వైరస్ సోకిన తొలి రోజుల్లో అనారోగ్యానికి గురైన ఆమె దీన్ని తేలిగ్గా తీసుకున్నారు. డిసెంబర్ 10వ తేదీన తన ఇంటికి సమీపంలోని ఓ క్లినిక్లో చికిత్స చేయించుకున్నారు. జలుబు, దగ్గు, జ్వరం తగ్గడానికి ఆమెకు ఆ క్లినిక్లో డాక్టర్లు ఇంజెక్షన్ వేశారు. వారంరోజుల తరువాత కూడా దగ్గు, జ్వరం తగ్గకపోవడంతో వెయ్ గుయిగ్జియాన్ ఈ సారి ఎలెవెంత్ హాస్పిటల్కు వెళ్లారు. అక్కడా ఆమెకు నయం కాలేదు. జ్వరం తీవ్రతరం కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను వుహాన్లోనే అత్యాధునికమైన వుహాన్ యూనియన్ ఆసుపత్రికి తరలించారు.
వైరస్ సోకినట్టు నిర్ధారించిందక్కడే..
గుయిగ్జియాన్కు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించింది వుహాన్ యూనియన్ ఆసుపత్రిలోనే. డిసెంబర్ 16వ తేదీన ఆమెకు యూనియన్ ఆసుపత్రిలో రక్త పరీక్షలను నిర్వహించారు. రెండురోజుల తరువాత దాని ఫలితాలను చూసి డాక్టర్లు బిత్తరపోయారు. గుయిగ్జియాన్కు భయానక కరోనా వైరస్ సోకినట్లు స్పష్టమైంది. దీనితో ఆమెను క్వారంటైన్కు తరలించారు. డిసెంబర్ చివరివారంలో హ్యూనన్ ఫిష్ మార్కెట్ను మూసివేశారు. అప్పటికే ఆలస్యమైందని, ఈ వైరస్ చాలామందికి సోకి ఉంటుందని చైనాకు చెందిన `ది పేపర్` కథనాన్ని ఉటంకిస్తూ వాల్స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది.
కోలుకున్న గుయిగ్జియాన్
సుమారు 14 రోజుల చికిత్స అనంతరం గుయిగ్జియాన్ కోలుకున్నారు. తన అనారోగ్యానికి కారణం కరోనా వైరస్సేనని తాను భావించలేదని గుయిగ్జియాన్ తెలిపారు. జలుబు సోకిన తరువాత కూడా తాను పెద్ద ఎత్తున వ్యాపార కార్యకలాపాలను నిర్వహించానని, దాని ఫలితంగా చాాలామందికి వైరస్ సోకి ఉండొచ్చని ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు వాల్స్ట్రీట్ జర్నల్ స్పష్టం చేసింది. దీనిపై మరో భిన్నమైన కథనాన్ని చైనా మీడియా వెల్లడించింది. గుయిగ్జియాన్ మొట్టమొదటి పేషెంట్ కాకపోవచ్చని, ఈ వైరస్ లక్షణాలు డిసెంబర్ 1వ తేదీ నాడే వెలుగులోకి వచ్చాయనే అభిప్రయాలు వ్యక్తమౌతున్నాయి.