ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం: భవనాలు ధ్వంసం, ముగ్గురి మృతి, వందలాది మందికి గాయాలు
మనీలా: దక్షిణ ఫిలిప్పీన్స్లో ఆదివారం భారీ భూంకంప సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆరేళ్ల చిన్నారి సహా ముగ్గురు మృతి చెందారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. ఫిలిప్పీన్స్ దక్షిణ భాగంలోని మిండనావ్ ద్వీపంలో ఈ భూకంపం వచ్చిందని అధికారులు వెల్లడించారు.
దక్షిణ భాగంలో పెద్ద నగరమైన దావావోకు 90 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపారు. రిక్టార్ స్కేలుపై దీని తీవ్రత 6.8గా నమోదైంది. అయితే, సునామీ వచ్చే సూచనలేమీ లేవని యూఎస్ జియోలాజికల్ సర్వే స్పష్టం చేసింది. ప్రకంపనల ధాటికి పడాడా నగరం భారీగా దెబ్బతింది. అనేక భవనాలకు బీటలువారాయి.
భూకంప సమయంలో ఓ ఇంట్లో ఉండిపోయిన చిన్నారి భవనం కూలిపోవడంతో మృతి చెందిందని ప్రావిన్స్ గవర్నర్ డగ్లస్ కాగాస్ తెలిపారు. ప్రకంపనలు ఆగిన అనంతరం ఆ చిన్నారి మృతదేహాన్ని సహాయక బృందాలు బయటికి తీశాయి. పడాడాలోని ఒక మార్కెట్లో భవనం కూలి ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
భూకంపంతో నగరంలోని ఆస్పత్రుల నుంచి రోగులను బయటికి తీసుకొచ్చేందుకు సహాయక బృందాలు, అధికారులు ప్రయత్నించారు. పలు షాపింగ్ మాల్స్, కార్యాలయాల్లోని ప్రజలు, సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు.
భూ ప్రకంపనాల కారణంగా కూలిపోయిన భవనాల కింద ఉన్నవారిని అధికారులు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశాధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టే కూడా భూకంపంలో చిక్కుకున్నారని, అయితే ఆయనకేమీ గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు.