అమెరికాలో కాల్పుల కలకలం: దుండగుల కాల్పుల్లో పోలీసు సహా ఆరుగురి మృతి..
అమెరికాలో దుండగులు మరోసారి రెచ్చిపోయారు. న్యూజెర్సీలో కాల్పుల మోత మోగించారు. మంగళవారం మధ్యాహ్నాం హార్ట్ స్కూల్ సమీపంలో కాల్పులకు తెగబడ్డారు. కాల్పులు జరిపింది ఎవరనే అంశంపై పోలీసులు నిర్ధారణకు రాలేదు. ఉగ్రవాదులు కాదు అని ప్రాథమికంగా నిర్ధారించారు.
దుండగులు కాల్పుల మోత మోగించారని స్థానికులు సమాచారం అందజేయడంతో పోలీసులు ఘటనాస్థలంలోకి చేరుకున్నారు. పోలీసులపై కూడా వారు ఫైర్ ఓపెన్ చేశారు. దుండగులు జరిపిన కాల్పుల్లో ఒక పోలీస్ అధికారి సహా ఆరుగురు చనిపోయారు. మరో అధికారి భుజానికి గాయమైందని మేయర్ స్టీవెన్ ఫులొప్ పేర్కొన్నారు. ఎంతమంది చనిపోయారనే అంశంపై మాత్రం ఆయన స్పష్టతనివ్వలేదు.
మరో ఇద్దరు పోలీసులు కూడా గాయపడ్డారని పేర్కొన్నారు. మరోవైపు కాల్పులతో హార్ట్ స్కూల్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాఠశాలలో ఉన్న విద్యార్థులు, సిబ్బంది క్షేమంగా ఉన్నారని అధికారులు తెలపారు. పోలీసులతో సహా స్వాట్, ఫెడరల్ ఏజెన్సీలు కూడా రంగంలోకి దిగాయి. ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కాల్పుల ఘటనపై డెమోక్రటిక్ గవర్నర్ ఫిల్ ముర్పే దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.