ఇటుకబట్టీలో ప్రమాదం: 6గురు భారతీయుల మృతి
న్యూఢిల్లీ/ఖాట్మాండ్: ఇటుకల ఫ్యాక్టరీలో చిమ్నీ కూలడంతో అక్కడ పనిచేస్తున్న ఆరుగురు భారతీయులు సహా ఎనిమిది మంది మృతిచెందారు. ఈ ఘటన తూర్పు నేపాల్లోని ఇటహరి నగరంలో చోటుచేసుకుంది. న్యూ జయ ఇటుక ఫ్యాక్టరీలో పేలుడు అనంతరం 105 అడుగుల పెద్ద చిమ్నీ కూలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ప్రమాదంలో నలుగురు మైనర్లు సహా ఆరుగురు భారతీయులు, ఇద్దరు నేపాల్వాసులు మృతి చెందారు. మరో 25 మంది గాయాలపాలయ్యారు. క్షతగాత్రులకు ఖాట్మాండ్లోని బిపి కొయిరాలా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
నేపాల్లో ఏప్రిల్లో సంభవించిన భారీ భూకంప ప్రభావంతో ఈ ఇటుకబట్టీ చిమ్నీ పై భాగం కూలింది. యజమాని దానికి మరమ్మతులు చేసి ఈ సోమవారమే తిరిగి ప్రారంభించి అందరికీ స్వీట్లు పంచారు. దాదాపు పదిలక్షల ఇటుకలను కాల్చుతుండగా ఒక్కసారిగా పేలుడు లాంటి పెద్ద శబ్దం సంభవించిందని క్షణాల్లో చిమ్నీ కూలిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
శిథిలాల కింద చిక్కుకుపోయిన మరికొందరిని కాపాడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. నేపాల్లో 850కి పైగా ఇటుక బట్టీలున్నాయి. పలువురు భారతీయులు వీటిలో పనిచేస్తున్నారు.
మృతుల వివరాలు:
పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన సద్దామ్ హుస్సేన్(16), రాహుల్ మియా(12), సలీం మియా(16), బీహార్కు చెందిన గరీబ్లాల్ పాశ్వాన్(50), మైథిలీస్ పాశ్వాన్(25), ముస్తాఫా మియా(16)లు ఉన్నారు. నేపాల్కు చెందిన భగాలీ దేవి చౌదరి(60), శివలాల్ చౌదరి(20)లు కూడా ఈ ప్రమాదంలో మృత్యువాతపడ్డారు.