ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవదహనం
లాహోర్: పాకిస్థాన్లో ప్రహరీ గోడ ఉన్న నగరంగా పేరుగాంచిన లాహోర్లో గురువారం విషాదం చోటు చేసుకుంది. మూడంతస్తుల బిల్డింగ్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నాలుగేళ్ల బాలుడితో పాటు మొత్తం ఆరుగురు సజీవ దహనమయ్యారు.
ఈ అగ్నిప్రమాద ఘటన గురువారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో చోటు చేసుకుందని ఉన్నతాధికారులు వెల్లడించారు. ప్రమాదం సంభవించిన వెంటనే స్థానికులు స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
అయితే ప్రమాదం సంభవించిన బిల్డింగ్ ప్రాంతం ఇరుకుగా ఉండటంతో ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకోలేపోయారు. దీంతో కొన్ని గంటలపాటు అగ్నిమాపక సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. సుమారు ఐదు గంటలపాటు అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను ఆర్పివేశారు.
మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆ ప్రాంతమంతా విషాదంతో నిండిపోయింది. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఉన్నాతాధికారి ఒకరు తెలిపారు. అయితే ఈ అగ్నిప్రమాదంలో నలుగురిని రక్షించినట్లు పేర్కొన్నారు.