కుప్పకూలిన హెలికాప్టర్: ఆరుగురు మృతి, మహిళను కాపాడారు
ఖాట్మాండ్: నేపాల్లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. గోర్ఖా జిల్లా నుంచి శనివారం ఉదయం టేకాఫ్ అయిన ఈ హెలికాప్టర్ బయలు దేరిన కొద్దిసేపటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సంబంధాలు తెగిపోయాయని సంబంధిత అధికారులు వెల్లడించారు.
విమానంలో ఆరుగురు ప్రయాణికులు, పైలట్ ఉన్నారు. వీరిలో జపాన్కు చెందిన ఓ పర్వతారోహకుడు ఉన్నట్లు తెలిపారు. 'హెలికాప్టర్ శిథిలాలు ధాఢింగ్ జిల్లాలోని పర్వతాల నడుమ అటవీ ప్రాంతంలో కనుగొన్నాం. మరో హెలికాఫ్టర్ ద్వారా, కాలినడకన సహాయ బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి'' అని ఖాట్మాండ్ విమానాశ్రయ జనరల్ మేనేజర్ రాజ్ కుమార్ ఛత్రి తెలిపారు.
కాగా, ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా, ఓ మహిళా ప్రయాణికురాలిని సహాయ సిబ్బంది రక్షించారు. నేపాల్లో హెలికాప్టర్ల వినియోగం చాలా ఎక్కువ. రహదారులు లేని ప్రాంతాలకు పర్యాటకులను తీసుకెళ్లేందుకు అక్కడ వీటిని విరివిగా ఉపయోగిస్తారు. కానీ, వాయు మార్గ ప్రయాణంలో పాటించాల్సిన భద్రత ప్రమాణాలు పాటించని కారణంగానే ఇలాంటి ప్రమాదాలు చేసుకుంటున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.