ప్రకృతి విలయం: 60 మంది దుర్మరణం..41 మంది మిస్సింగ్: తుడిచి పెట్టుకుపోతున్న గ్రామాలు
ఖాట్మండు: హిమాలయన్ కంట్రీ నేపాల్లో ప్రకృతి ప్రకోపించింది. విలయాన్ని సృష్టించింది. భారీ వర్షాలు.. నేపాల్ పశ్చిమ ప్రాంతాన్ని ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలు, వరదల వల్ల ఒకదాని వెంట ఒకటిగా కొండచరియలు విరిగి పడుతున్నాయి. గ్రామాలకు గ్రామాలను తుడిచి పెట్టేస్తున్నాయి. వరదలు, కొండచరియలు విరిగి పడిన ఘటనలో నేపాల్లో ఇప్పటిదాకా 60 మంది మృత్యువాత పడ్డారు. 41 మందికి పైగా అదృశ్యం అయ్యారు. వారంతా మరణించి ఉండొచ్చనే అనుమానాలు ప్రాథమికంగా వ్యక్తమౌతున్నాయి. కొండచరియలు విరిగిపడిన ఘటనలో వందలాది మంది నిరాశ్రయులయ్యారు. అధికారలు వారికి పునరావసాన్ని కల్పించారు.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతను బలి తీసుకున్న కరోనా: అనుచరుల్లో ఆందోళన: హోమ్ క్వారంటైన్
నేపాల్లో నాలుగు రోజులుగా ఏకధాటిగా కురుస్తోన్న వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాల వల్ల వరదలు సంభవిస్తున్నాయి. నేపాల్ పశ్చిమ ప్రాంతంలోని మ్యాగ్డీ జిల్లాపై ప్రకృతి పగబట్టినట్టు కనిపిస్తోంది. వరదల వల్ల మ్యాగ్డీ జిల్లా తీవ్రంగా దెబ్బతింది. ఈ ఒక్క జిల్లాలోనే 27 మంది మరణించారు. పలువురు గల్లంతు అయ్యారు. భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగి పడుతున్నాయి. ఫలితంగా బురదతో కూడుకున్న వరదలు సంభవిస్తున్నాయి. పర్వతాలతో నిండి ఉన్న ఈ జిల్లాలో అత్యధిక గ్రామాలు పర్వత సానువుల్లో ఉన్నవే.
భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడటంతో ఆయా గ్రామాలన్నీ మట్టికొట్టుకునిపోతున్నాయి. తుడిచి పెట్టుకునిపోతున్నాయి. మరోవంక అధికారులు సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. బురద, విరిగిపడిన కొండ చరియలు తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు వెలికి వస్తున్నాయి. ఇప్పటికే 60 మృతదేహాలను వెలికి తీసినట్లు జిల్లా అధికారులు తెలిపారు. మ్యాగ్డీ జిల్లాలోని ధౌలాగిరిలో రెండు వీధుల్లో ఎనిమిది అడుగుల ఎత్తున బురద పేరుకునిపోయిందని అధికారులు తెలిపారు. వాటిని తొలగిస్తున్నామని చెప్పారు. నిరాశ్రయాలకు పునరావసాన్ని కల్పించినట్లు చెప్పారు.
Recommended Video
కొండచరియలు విరిగిన పడినలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని జిల్లా అధికారులు అనుమానిస్తున్నారు. 41 మందికి పైగా గల్లంతు అయ్యారని, వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు. మ్యాగ్డీకి ఆనుకునే ఉన్న జిల్లాల్లోనూ ఇవే తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాగా.. మున్ముందు మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు నేపాల్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్త చర్యగా కొండచరియలు విరిగి పడే అవకాశం ఉన్న గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారు. వారి కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశారు.