కాబూల్లో తెగబడ్డ ఐసిస్: 61 మంది దుర్మరణం
కాబూల్: అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్లో ఉగ్రవాదులు తెగబడ్డారు. ప్రదర్శన సందర్భంగా పెద్ద యెత్తున పేలుళ్లు సంభవించడంతో 61 మంది మరణించారు. మరో 207 మంది గాయపడ్డారు. ఈ చర్యకు పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ప్రకటించుకుంది.
ఈ విషయాన్ని అఫ్గాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది.. ప్రధానమైన ప్రాంతీయ విద్యుత్తు లైన్ తమ ప్రాంతం గుండా వెళ్లాలని జాతీయ హజారస్ డిమాండ్ చేస్తూ ప్రదర్శన నిర్వహించింది. అఫ్గాన్ టెలివిజన్లలో, సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి.
శవాలు చెల్లచెదురుగా పడిపోయి ఉన్నాయి. తామే బాంబులు వేసినట్లు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్నకు చెందిన న్యూస్ ఏజెన్సీ తెలిపింది. కోపోద్రిక్తులైన ప్రజలు పోలీసులను, సెక్యూరిటి బలగాలను అడ్డుకున్నారు. భద్రతా బలగాలపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు.
పేలుళ్లను ఖండిస్తూ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని ఓ ప్రకటన విడుదల చేశారు. శాంతియుత ప్రదర్శనలు అఫ్గాన్ పౌరుల హక్కు అని, వారికి భద్రత కల్పించడానికి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని ఆయన చెప్పారు.