యువతిని పెళ్లాడిన వృద్ధమంత్రి, చిన్నారిని చంపిన పులి
ఢాకా: 67 ఏళ్ల ముసలి వ్యక్తి ఒకరు ముప్పయ్యేళ్లు కూడా నిండని ఓ యువతిని పెళ్లాడాడు. ఈ సంఘటన బంగ్లాదేశ్లో చోటు చేసుకుంది. పైగా ఆయన బంగ్లాదేశ్ రైల్వేశాఖ మంత్రి కూడా కావడం గమనార్హం. ముజీబుల్ హఖ్ అనే ఈ మంత్రి 29 ఏళ్ల యువతి హనూఫా అఖ్తర్ రిక్తాను పెళ్లాడాడు.
ఆమె ఇంట్లో జరిగిన ఈ వేడుకలో మంత్రిగారు కబీన్ నామా (పెళ్లి ఒప్పందం) పైన సంతకం చేశారు. ఇందుకు గానూ అమ్మాయి కుటుంబానికి ఐదు లక్షల టాకాలను హక్ చెల్లించారు. ఈ వేడుకకు మంత్రి తరఫున 700 మంది చుట్టాలొచ్చారట. 67 ఏళ్ల ఈ ముసలి వ్యక్తి 29 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకోవడంపై ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.
నేపాల్లో రోడ్డు ప్రమాదం: 10 మంది మృతి
నేపాల్లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీకొన్న ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది.
చైనాలో సర్కస్ పులికి చిన్నారి బలి
నెల క్రితం ఢిల్లీలో ఓ యువకుడు పులి ఎన్క్లోజర్లో పడి.. దాని దాడికి గురై మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి సంఘటనే చైనాలో సంభవించింది. సర్కస్ పులి నోటికి 8 ఏళ్ల చిన్నారి బలైంది.
నైరుతి చైనాలోని లెహెలెదు అమ్యూజ్మెంట్ పార్కులో ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పులికి శిక్షణ ఇచ్చే ప్రాంతంలోకి పొరపాటున ఆ పాప జారిపడటంతో.. విషాదం నెలకొంది. పులి పంజా ధాటికి తీవ్రగాయాలైన ఆ చిన్నారి చికిత్స పొందుతూ మరణించింది. సంఘటనతో పార్కులో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. ఆ చిన్నారి తల్లిదండ్రులతో పార్కు ఒప్పందం చేసుకుంది.