షాకింగ్: లిబియాలో 7భారతీయుల కిడ్నాప్ - అందులో తెలుగువారు - కేంద్రం కీలక ప్రకటన
అంతర్యుద్ధంతో ఆగమైపోయిన ఉత్తర ఆఫ్రికా దేశం లిబియాలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. పలు ఉగ్రవాద గ్రూపులు, సైన్యాలకు మధ్య నిత్యం కొట్లాటలు జరుగుతుండగా.. వివిధ కారణాలతో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులు కిడ్నాప్ కు గురయ్యారు. దీనికి సంబంధించి భారత విదేశాంగ శాఖ గురువారం కీలక ప్రకటన చేసింది.
సెప్టెంబర్ 14న ఏడుగురు భారతీయులు కిడ్నాప్ కు గురయ్యారని, భారత్ కు తిరిగొచ్చేందుకుగానూ వారంతా ట్రిపోలీ విమానాశ్రయానికి వస్తుండగా.. మధ్యలో అశ్వరీఫ్ ప్రాంతం వద్ద సాయుధ మూకలు వారిని అడ్డుకుని అపహరించాయని విదేశాంగ శాక అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మీడియాకు చెప్పారు. కాగా, కిడ్నాపర్ల చెర నుంచి మనవాళ్లను కాపాడేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని, గురువారం నాటికి వారంతా క్షేమంగానే ఉన్నట్లు తెలిసిందని ఆయన పేర్కొన్నారు.
లిబియాలో కిడ్నాపైన ఏడుగురు భారతీయులు.. ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ కు చెందినవారని, వాళ్లు పని చేస్తోన్న కంపెనీల ప్రతినిధులు.. కిడ్నాపర్లతో చర్చలు జరుపుతున్నారని, ఫొటోలు, ఐడీ కార్డుల ద్వారా మనవాళ్లను గుర్తించడం కూడా పూర్తయిందని శ్రీవాస్తవ తెలిపారు. వారి పేర్లు, ఇతర వివరాలు చెప్పేందుకు ఆయన నిరాకరించారు. ''అపహరణకు గురైనవారి కుటుంబాలతో అధికారులు నిరంతరం మాట్లాడుతుననారు. అదే సమయంలో లిబియా అధికారులు, అక్కడి కంపెనీల యజమానులతోనూ సంప్రదింపులు జరుపుతున్నాం. వీలైనంత తొందరగా మనవాళ్లను చెర నుంచి విడిపించేందుకు ప్రయత్నిస్తున్నాం'' అని ఆయన వివరించారు.
విస్తృతమైన చమురు సంపద కలిగిన లిబియా దేశం.. 2011లో గడాఫీ మరణం తర్వాత కుక్కలు చింపిన విస్తరిలా మారిన సంగతి తెలిసిందే. ఎక్కడిక్కడ సాయుధ గ్రూపులు ప్రాంతాలను కైవసం చేసుకుని రాజ్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. మారిన పరిస్థితుల నేపథ్యంలో 2015లోనే లిబియాకు ప్రయాణాలను భారత్ నిషేధించింది. ఇప్పుడు కిడ్నాప్ కు గురైన ఏడుగురు భారతీయులు అక్కడికి ఎలా వెళ్లారు, ఏం జరిగిందనే విషయాలు చెర నుంచి బయటపడిన తర్వాతే వెల్లడవుతాయి.