ఇటలీలో భారీ భూకంపం: కుప్పకూలిన భవనాలు, 247మంది మృతి
రోమ్: ఇటలీ దేశాన్ని బుధవారం తెల్లవారుజామున భారీ భూకంపం కుదిపేసింది. దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ భూప్రకంపనలు సంభవించాయి. వీటి తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.2గా నమోదైంది. రీటి ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. రాజధాని రోమ్లోనూ 20 సెకన్ల పాటు భూమి కంపించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భూకంపం ధాటికి పలు భవనాలు కుప్పకూలాయి. ఇప్పటివరకు 120మంది మృతిచెందగా.. వందల సంఖ్యలో గాయాలపాలయ్యారు.
శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. సహాయక బృందాలు శిథిలాల నుంచి బయటికి తీసేందుకు చర్యలు చేపట్టాయి.
భూకంపం ధాటికి ఎమాట్రిస్ నగరం ధ్వంసమైనట్లు నగర మేయర్ సర్జియో పిరోజీ తెలిపారు. నగరం నడిబొడ్డున భారీ భవనాలు కుప్పకూలిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
భూకంప తీవ్రతను ముందుగా గుర్తించే యూఎస్జీఎస్ పేజర్ సిస్టమ్ ఇటలీలో రెడ్అలర్ట్ ప్రకటించింది. కాగా, 2009లో ఇటలీలోని అకీలా ప్రాంతంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ ఘటనలో 300 మంది ప్రాణాలు కోల్పోయారు.
భారతీయులు క్షేమం
ఇటలీలో నివసించే భారతీయులకు ఎలాంటి ప్రమాదంజరగలేదని.. వారు క్షేమంగానే ఉన్నట్లు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ఇటలీలో 247కి చేరిన భూకంప మృతులు
భూకంప తీవ్రత కారణంగా మృతి చెందిన వారిసంఖ్య గంటగంటకు పెరిగిపోతోంది. ఈ సంఖ్య గురువారం నాటికి 247కి చేరింది. 368 మంది తీవ్రంగా గాయపడ్డారు. వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఇటలీ ప్రధాని మాటియో రెన్జీ వెల్లడించారు. భూకంప తీవ్రతకు మధ్య ఇటలీలోని పర్వతప్రాంతాలైన అంబ్రియా, మార్షే, లజియో కకావికలమయ్యాయి. అమాట్రీస్, అక్యుమోలి, పెస్కారా డెల్ ట్రోంటో పట్టణాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.