అమెరికాలో మువ్వన్నెల రెపరెప - న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో తొలిసారి భారత జెండా పండుగ..
అగ్రరాజ్యం అమెరికా ఆర్థికాభివృద్ధిలో వెన్నెముక పాత్ర పోషిస్తోన్న భారతీయులు 74వ భారత స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. వాషింగ్టన్ నుంచి హ్యూస్టన్ దాకా అమెరికాలోని పలు ప్రాంతాల్లో భారత జాతీయ పతాక రెపరెపలాడింది. మువ్వన్నెల జెండా చేతబట్టిన భారతీయ అమెరికన్లు.. 'భారత్ మాతాకీ జై' నినాదాలతో హోరెత్తించారు. అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ లోని ప్రతిష్ఠాత్మక టైమ్స్ స్క్వేర్ లో తొలిసారి మన జెండా ఆవిష్కరణ హైలైట్ గా నిలిచింది.
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ (ఎఫ్ఐఏ) ఆధ్వర్యంలో టైమ్స్ స్క్వేర్ వద్ద వందలాది మంది ఎన్నారైల సమక్షంలో న్యూయార్క్ లోని భారత రాయబారి రణధీర్ జైస్వాల్ జాతీయ పతాకాన్ని ఎగరేశారు. టైమ్స్ స్క్వేర్ వద్ద భారతీయులు చరిత్ర సృష్టించారని, ఇక్కడ జెండా ఎగరేసి అవకాశం రావడం గర్వకారణమని జైస్వాల్ అన్నారు.
మాటలేకాదు, మౌనమూ ఆయన ఆయుధమే - వాజపేయి వర్ధంతిన జాతి నివాళి - సదైవ్ అటల్ వద్ద నేతల పుష్పాంజలి
కొవిడ్-19 నిబంధనల కారణంగా పరిమిత సంఖ్యలో మాత్రమే, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ వేడుక నిర్వహించామని ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు అలోక్ కుమార్ చెప్పారు. భారత్, అమెరికా చరిత్రలో ఇదొక సరికొత్త అధ్యాయమన్నారు. టైమ్స్ స్క్వేర్ తోపాటు ప్రఖ్యాత ఎంపైర్ స్టేట్ భవంతి వద్ద కూడా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి.
అటు దేశరాజధాని వాషింగ్టన్ డీసీలోనూ ఇండియన్ అమెరికన్లు, ఎన్నారైలు డ్రైవ్ థ్రూ, తదితర ఈవెంట్ల ద్వారా ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రముఖ హాలీవుడ్ నటి మేరీ మిల్బెన్.. భారతీయులకు శుభాకాంక్షలు చెబుతూ, జనమణ ఆలపించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలైంది. కొంతకాలంగా ఆమె హిందీ కూడా నేర్చుకుంటున్నారు. మిల్బెన్ సహా హాలీవుడ్ ప్రముఖులు, అమెరికా వ్యాపార దిగ్గజాలు సైతం భారతీయులకు అభినందనలు తెలియజేశారు.