వామ్మో ఏందీ వింత: రాత్రికి రాత్రే మాయమైన అతి పెద్ద బ్రిడ్జి.. ఎలా సాధ్యమైంది..
మాస్కో: రష్యాలో వింత చోటుచేసుకుంది. ఆర్కిటిక్ ప్రాంతంలోని ఉంబా నదిపై ఉన్న బ్రిడ్జి రాత్రి రాత్రికే మాయమైంది. దీంతో అక్కడి వారు షాక్కు గురయ్యారు. రాత్రి వరకు నిటారుగా ఉన్న ఆ బ్రిడ్జి తెల్లారేసరికి అక్కడ లేక పోవడంతో చాలా మంది విస్మయానికి గురయ్యారు. మాయమయ్యేందుకు అది ఆషామాషీ బ్రిడ్జి కాదు. 75 అడుగుల పొడవు 50 టన్నుల బరువు ఉన్న బ్రిడ్జి. అసలు ఎలా మాయమయ్యేందో తెలుసుకునేందుకు చిన్న ఆనవాలు కూడా లేకపోవడంతో అధికారులు కూడా షాక్కు గురవుతున్నారు.
ఫోటోలు వైరల్
కొద్ది రోజుల క్రితం రష్యా సోషల్ మీడియా వీకేలో ఈ బ్రిడ్జికి సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ బ్రిడ్జిలో కొంత భాగం ధ్వంసం అయ్యి దానికి సంబంధించిన శిథిలాలు నీటిలో పడిపోయిన ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే ఇది ఏదో ఫేక్ అయి ఉంటుందని చాలా మంది భావించారు. ఫోటోలు వైరల్ అయిన కొద్ది రోజులకే అక్కడ ఉన్న బ్రిడ్జి మాయం కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాదు ఆ బ్రిడ్జి శిథిలాలు కూడా కనిపించకపోవడం మరింత షాక్కు గురిచేసింది.
రాత్రికి రాత్రే ఎలా మాయమైంది
ఇక అసలు బ్రిడ్జి రాత్రికి రాత్రే ఎలా మాయమైందన్న దానిపై అధికారులు పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. విచారణ చేసిన అధికారులు కూడా తలలు పట్టుకుంటున్నారు. నదిలోకి బ్రిడ్జ్ మునిగిపోయిందా అంటే అది జరగలేదు. అందుకు ఆధారాలు కూడా లభించలేదని చెబుతున్నారు. పోనీ ఏదైనా సహజ విపత్తు వచ్చి బ్రిడ్జి కూలిపోయిందా అంటే అదీ జరగలేదు. మరి నిటారుగా ఉండాల్సిన వంతెన ఏమైనట్టు అని అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
మరో వెర్షన్
అయితే స్థానికులు మాత్రం మరో వెర్షన్ వినిపిస్తున్నారు. బ్రిడ్జిని దొంగలు కొల్లగొట్టి ఉంటారని దాన్నుంచి మెటల్ను తీసుకునేందుకు ఈ పని చేసి ఉంటారనే అనుమానం వ్యక్తం చేశారు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు పోలీసులు ఈ దొంగలను పట్టుకోలేకపోయారు. కనీసం ఎలా మాయమై ఉంటుందో అనేదానిపై కూడా ఒక అవగాహనకు రాలేకపోతున్నారు. మొత్తానికి మిస్టరీని చేధించే పనిలో పోలీసులు ఇతర అధికారులు నిమగ్నమై ఉన్నారు.