గ్యాస్ స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం: 75మంది మృతి
అక్ర: ఘనా దేశ రాజధాని అక్రలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక క్రుమా సర్కిల్ వద్ద గ్యాస్ స్టేషన్లో బుధవారం ఈ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 75 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు.
అక్ర నగరంలోని వివిధ ఆసుపత్రుల్లోక్షతగాత్రులు చికిత్స పొందుతున్నారని స్థానిక మీడియా గురువారం వెల్లడించింది. మృతులు, క్షతగాత్రులు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఘనా జాతీయ అగ్నిమాపక సర్వీస్ ఉన్నతాధికారులు వెల్లడించినట్లు తెలిపింది.
అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని పేర్కొంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పింది. ఈ అగ్నిప్రమాదంలో గ్యాస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లోని నిలిపి ఉంచిన వాహనాలు కూడా అగ్నికి ఆహుతి అయ్యాయని మీడియా పేర్కొంది.
ఇది ఇలా ఉండగా, ప్రమాదం అనంతరం అక్ర నగరంలో కొన్ని గంటలపాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో అగ్ని ప్రమాదం ప్రభావం కొంత మేర తగ్గింది. కాగా, ఈ భారీ వర్షంతో అక్ర నగరంలో వరదలు వచ్చాయి.