మసీదుపై క్షిపణి దాడి..75 మంది సైనికులు మృతి..ప్రతీకారచర్యలో భాగంగానే..!
ఇరాన్ మద్దతు ఇస్తున్న హౌతీ రెబెల్స్ నిర్వహించిన క్షిపణి మరియు డ్రోన్ దాడుల్లో యెమెన్కు చెందిన 75 మంది సైనికులు మృతి చెందినట్లు మెడికల్ మరియు మిలటరీ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. శనివారం మారిబ్లోని సెంట్రల్ ప్రావిన్స్లో సైనికశిబిరంపై జరిపిన దాడుల్లో సైనికులు మృతి చెందారు. దీంతో గత కొద్ది రోజులుగా నిశబ్ధంగా ఉన్న ప్రాంతంలో ఒక్కసారిగా యుద్ధ వాతావరణ కనిపించింది. యెమెన్లకు సౌదీ మిలటరీ సహకారం ఉంది.
ఇరాన్ మద్దతు ఇస్తున్న హౌతీ రెబల్స్ దాడిలో 75 మంది సైనికులు మృతి చెందగా 100 మందికి పైగా గాయాలు అయినట్లు మిలటరీ అధికారులు చెప్పారు. క్యాంపుకు సమీపంలో ఉన్న మసీదు లక్ష్యంగా డ్రోన్లు మరియు క్షిపణులతో దాడి జరిగినట్లు అధికారులు తెలిపారు. మసీదులో ప్రార్థనలు చేసేందుకు సైనికులంతా గుమికూడిన సమయంలో దాడులు జరిగినట్లు మిలటరీ అధికారి ఒకరు తెలిపారు. హౌతీలను లక్ష్యంగా చేసుకుని సానాకు ఉత్తరంలో ఉండే నాహమ్ ప్రాంతంలో సంకీర్ణ దళాలు చేపట్టిన ఆపరేషన్కు ప్రతీకారచర్యల్లో భాగంగానే దాడులు జరిగాయి. సంకీర్ణ దళాలు చేసిన దాడుల్లో డజనుకు పైగా హౌతీ మిలీషియా సభ్యులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు.
మసీదుపై జరిగిన దాడిని యెమెన్ అధ్యక్షుడు అబెద్రాబ్బో మన్సోరీ హది ఖండించారు. దాడిని పిరికపంద చర్య ఉగ్రవాదుల చర్యగా ఆయన అభివర్ణించారు. హౌతీ రెబెల్స్ చేసిన దాడి చూస్తే ఆ ప్రాంతం శాంతియుతంగా ఉండటం హౌతీలకు ఇష్టం లేదనేది స్పష్టం అవుతోందని చెప్పారు. హౌతీలకు ప్రాణాలు తీయడం విధ్వంసం చేయడం మాత్రమే తెలుసునని అధ్యక్షుడు అబెద్రాబ్బో మండిపడ్డారు. ఇరాన్ ప్రభుత్వం చిల్లర పనులకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దాడికి సంబంధించి హౌతీలు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.