అమెరికాలో అగంతకుడి కాల్పులు... 8 మందికి గాయాలు.. భయం గుప్పిట్లో విస్కాన్సిన్...
అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రంలో శుక్రవారం(నవంబర్ 20) కాల్పులు చోటు చేసుకున్నాయి. మిల్వాకీలోని ఓ షాపింగ్ మాల్లో గుర్తు తెలియని అగంతకుడు అమాయకులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో 8 మంది గాయపడ్డారు. ఇందులో ఒక టీనేజర్ కూడా ఉన్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. సమాచారం అందిన వెంటనే హుటాహుటిన తాము అక్కడికి చేరుకున్నామని... అయితే అప్పటికే అగంతకుడు పారిపోయాడని తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 2.50గం. సమయంలో కాల్పులు చోటు చేసుకున్నట్లు తెలిపారు.
కాల్పుల్లో గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. గాయాల తీవ్రత గురించి ఇంకా ఏమీ తెలియలేదన్నారు. కాల్పుల ఘటనతో ఆ మాల్ను మూసివేశామని... మళ్లీ నోటీసులు ఇచ్చేంతవరకు మాల్ను తెరవవద్దని ఆదేశాలిచ్చామన్నారు. స్థానిక మేయర్ డెన్నిస్ మెక్ బ్రైడ్ మాత్రం.. గాయపడ్డవారిలో ఎవరికీ ప్రాణహాని లేదని.. అందరి ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు.
ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న వివరాల ప్రకారం కాల్పులు జరిపిన వ్యక్తి శ్వేత జాతీయుడు. అతని వయసు సుమారు 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు. అతను మొత్తం 12 రౌండ్ల కాల్పులు జరిపినట్లు చెప్పారు. కాల్పుల శబ్దం వినగానే భయంతో మాల్లోనే దాక్కుండిపోయినట్లు తెలిపారు.ఈ ఘటనపై ఆ మాల్ యాజమాన్యం స్పందిస్తూ... కాల్పుల ఘటన తమను తీవ్రంగా కలచివేసిందని పేర్కొంది.తక్షణమే స్పందించిన పోలీసులకు ధన్యవాదాలు తెలియజేసిన యాజమాన్యం... పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తామని తెలిపింది. కాల్పుల ఘటనతో స్థానిక ప్రజల్లో భయాందోళన నెలకొంది.
ఇదే షాపింగ్ మాల్ సమీపంలో ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ కాల్పులు చోటు చేసుకున్నాయి. తప్పించుకు పారిపోతున్న 17 ఏళ్ల ఓ నల్లజాతీయుడిని పోలీసులు కాల్చి చంపారు. ఆ యువకుడు తమపై కాల్పులు జరపడంతోనే తాము ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు.
Recommended Video
ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో విస్కాన్సిన్లో డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ రాష్ట్రంలో జో బైడెన్ 49.4 శాతం ఓట్లను గెలుపొందగా.. ట్రంప్ 48.8 శాతం ఓట్లను గెలుచుకున్నారు. ఇక్కడి 10 ఎలక్టోరల్ ఓట్లు బైడెన్ ఖాతాలో చేరాయి.