విహారయాత్రలో విషాదం: హోటల్ గదిలో గ్యాస్ లీక్.. నేపాల్లో చిన్నారులు సహా 8మంది కేరళీయుల మృతి
ఖాట్మాండు: నేపాల్లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. డామన్లోని ఓ హాస్టల్ గదిలో కేరళ రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది కుటుంబసభ్యులు మరణించారు. వీరిలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటన స్థానికలంగా కలకలం సృష్టించింది.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన హోటల్ వద్దకు చేరుకున్నారు. మృతులను ప్రబీన్ కుమార్(39), శరణ్య(34), రంజిత్ కుమార్ టీ.బీ.(39), ఇందూ రంజిత్(34), శ్రీభద్ర(9), అభినవ్ సూర్య, అభి నాయర్(7), వైష్ణవ్ రంజిత్(2)లుగా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 15 మంది కుటుంబసభ్యులు గల ఆ ఫ్యామిలీ నేపాల్ పర్యటనకు వచ్చారు. మృతులంతా కేరళ తిరువనంతపురం జిల్లా చెంకొట్టుకోనంకు చెందిన వారని తెలిపారు.
'మరణించిన వారి వివరాలు సేకరిస్తున్నాం. గదిలో వీరు గ్యాస్ హీటర్ ఉపయోగించారు. దీనికారణంగా ఊపిరాడని పరిస్థితిలోనే వీరంతా మృతి చెందినట్లు భావిస్తున్నాం' అని మక్వాన్పూర్ జిల్లా ఎస్పీ సుశీల్ సింగ్ రాథోర్ తెలిపారు. సరైన వెంటిలేషన్ లేని కారణంగానే ఇది జరిగిందని తెలిపారు.
వీరంతా ఎవరెస్ట్ పనోరమ రీసార్ట్ హోటల్లో బస చేశారు. అక్కడ అత్యంత చలిగా ఉండటంతో గదిలో వేడి కోసం గ్యాస్ వెలిగించారని.. ఆ గ్యాస్ అంతా గది మొత్తం వ్యాపించడంతో ఊపిరాడక మరణించినట్లు తెలుస్తోంది.
సమాచారం అందిన వెంటనే భారత ఎంబసీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. హాస్పిటల్ ఫర్ అడ్వాన్స్డ్ మెడిసిన్ అండ్ సర్జరీ(హెచ్ఏఎంఎస్)కు ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఎనిమిది మందిని తీసుకెళ్లారు. అయితే, అప్పటికే వారంతా మృతి చెందారని వైద్యులు నిర్ధరించారు.