పెషావర్లో పేలుడు: జర్నలిస్టుతోపాటు 11మంది మృతి
పెషావర్: పాకిస్థాన్లోని పెషావర్ మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. జమ్రూద్ ఖైబర్ ఏజెన్సీ కర్ఖానో మార్కెట్ ప్రాంతంలో చెక్ పోస్టు సమీపంలో ఈ భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదం 11మంది మృతి చెందగా, మరో 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ మేరకు వివరాలను హయతాబాద్ మెడికల్ కాంప్లెక్స్ అధికారులు తెలిపారు. ఓ చిన్నారితోపాటు నలుగురు భద్రతాధికారులు కూడా మృతుల్లో ఉన్నారని చెప్పారు. జమ్రూద్ ఖసదార్ లైన్ అధికారి నవాబ్ షా కూడా ఈ దాడిలో మృతి చెందినట్లు సమాచారం.
మోటర్ బైక్లో బాంబు పెట్టి పేల్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే ఇది ఆత్మాహుతి దాడా? లేక రిమోట్తో బాంబును పేల్చారా? అనేది తేలాల్సి ఉంది. బాంబు పేలుడుతో భారీ మంటలు వ్యాపించాయి.
దీంతో అక్కడ కార్లు, ఇతర వాహనాలు దగ్ధమయ్యాయి. ఆజ్ టీవీ జర్నలిస్ట్ మెహబూబ్ షా అఫ్రిదీ కూడా ఈ బాంబు పేలుళ్ల ఘటనలో మృతి చెందాడు. కాగా, గతంలో పెషావర్లోని ఓ పాఠశాలలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో సుమారు 150మందికి పైగా విద్యార్థులు, సిబ్బంది మృతి చెందిన విషయం తెలిసిందే.