కొలంబో సెంట్రల్ బస్ స్టేషన్ లో 87 డిటొనేటర్లు: అవి పేలి ఉంటే..మరో విధ్వంసకాండే
కొలంబో: ఆత్మాహూతి దాడులు అనంతరం అల్లకల్లోలానికి గురైన ద్వీప దేశం శ్రీలంకలో పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదు. దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడేం జరుగుతుందో తెలియని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు లంకేయులు. దేశం మొత్తం మీద 11 చోట్ల ఆత్మాహూతి దాడులు గానీ, బాంబు పేలుళ్ల గానీ చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయంటూ పదిరోజుల కిందటే ఓ విదేశీ ఇంటెలిజెన్స్ అధికారులు శ్రీలంక ప్రభుత్వాన్ని హెచ్చరించిన విషయం తెలిసిందే.
ఇప్పటిదాకా ఎనిమిది చోట్ల పేలుళ్లు సంభవించాయి. ఇక మిగిలిన మూడు ప్రాంతాల్లో భారీ ఎత్తున విధ్వంసం చోటు చేసుకోవచ్చనే భయాందోళనలకు గురి అవుతున్నారు స్థానికులు. వారి భయాన్ని నిజం చేస్తూ- రాజధాని కొలంబో నడిబొడ్డున ఉన్న సెంట్రల్ బస్ స్టేషన్ లో 87 బాంబు డిటొనేటర్లు లభించాయి. సోమవారం పోలీసులు వాటిని గుర్తించారు. డిటొనేటర్ల శక్తిమంతమైనవని తేల్చారు. వాటన్నింటినీ నిర్వీర్యం చేశారు. అవి పేలి ఉంటే మరో విధ్వంసం సంభవించి ఉండేదని అంటున్నారు పోలీసులు.
కొలంబో నడిబొడ్డున ఉన్న పేట్ట ప్రాంతంలో ఉంటుందీ బస్ స్టేషన్. ప్రధాన బస్ స్టేషన్ అదే కావడంతో రోజూ వందలాది మంద ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. అలాంటి బస్ స్టేషన్ టార్గెట్ గా చేసుకుని బాంబు డిటొనేటర్ల ద్వారా విధ్వంసం సృష్టించడానికి అసాంఘిక శక్తులు కుట్ర పన్ని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. బస్ స్టేషన్ లో అనుమానాస్పదంగా కనిపించిన పెద్ద పెద్ద సంచులను గుర్తించిన కొందరు ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. డిటొనేటర్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని నిర్వీర్యం చేశారు. శక్తిమంతమైనవని, అవి పేలి ఉంటే పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించి ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు.