కదలిన అమెరికా: ఏకంగా 87 సంఘాలు మద్దతు: రీగన్ హయాంలోనే బీజం
వాషింగ్టన్: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన మూడు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఉద్యమానికి అనూహ్య మద్దతు లభించింది. అగ్రరాజ్యం అమెరికాలోని యూఎస్ ఫుడ్ సావర్నిటీ అలయన్స్ మద్దతు ప్రకటించింది. 87 రైతు సంఘాలతో ఏర్పాటైన సమాఖ్య ఇది. 87 రైతు సంఘాలు ఓ బహిరంగలేఖను విడుదల చేశాయి. ప్రపంచ చరిత్రలో ఇప్పటివరకు చోటు చేసుకున్న అత్యంత శక్తివంతమైన ఆందోళనల్లో భారత రైతుల ఉద్యమం చేరుతుందని పేర్కొన్నాయి. భారత రైతులు డిమాండ్లను నెరవేర్చాల్సిన బాధ్యత అక్కడి ప్రభుత్వంపై ఉందని తెలిపింది.
Recommended Video
కొత్త చట్టాల ప్రకరాం.. కాంట్రాక్టు విధానంలో వ్యవసాయం అమలులోకి రావడం వల్ల రైతులు తమ పొలాల నుంచి క్రమంగా బహిష్కరణకు గురవుతారని ఆందోళన వ్యక్తం చేశాయి. రైతులను అన్ని విధాలుగా పరిరక్షించుకోవాల్సిన భాద్యత ప్రభుత్వాలపై ఉందని, మూడు వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు విక్రయాల్లో స్వేచ్చ ఉండదని పేర్కొన్నాయి. ఇలాంటి ప్రతికూల పరిణామాల మధ్య సంయుక్త కిసాన్ మోర్చా నిర్వహిస్తోన్న ఉద్యమాన్ని తాము గౌరవిస్తున్నామని, సంఘీభావాన్ని తెలుపుతున్నామని తెలిపాయి.
నూతన ఆర్థిక సంస్కరణల పేరుతో తమ దేశంలో తీసుకువచ్చిన చట్టాలు కూడా వ్యవసాయరంగంపై తీవ్ర ప్రతికూల స్వభావాన్ని చూపాయని, భారత్లోనూ ప్రస్తుతం అదే తరహాలో చట్టాలు తెస్తున్నారని 87 రైతు సంఘాలు తమ బహిరంగ లేఖలో తెలిపాయి. 40 సంవత్సరాల కిందట రొనాల్డ్ రీగన్ ప్రభుత్వం ఇదే రకమైన వ్యవసాయ విధానాలను తీసుకువచ్చారని, వాటి దుష్ప్రభావాలను చవి చేస్తన్నామని స్పష్టం చేశాయి. ఆ విధానాల వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని, అవి వ్యవసాయ సంక్షోభానికి దారి తీశాయని ఈ లేఖలో వివరించాయి.
ప్రపంచ వ్యాప్తంగా రైతులకు అనుకూల విధానాలు అవలంభించేలా తక్షణ చర్యలను తీసుకోవాలని 87 రైతు సంఘాలు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్కు విజ్ఞప్తి చేశాయి. ఇతర దేశాలతో పోలిస్తే యుఎస్లో వ్యవసాయ రంగానికి మద్దతు లభిస్తున్నా.. నల్లజాతీయులు, లాటినో, ఆసియా-పసిఫిక్ వంటి తరగతుల ప్రజలకు ఆ మద్దతు అందడం లేదని తెలిపాయి. ఈ అంశంపై కూడా దృష్టిసారించాల్సి ఉంటుందని విజ్ఞప్తి చేశాయి. డబ్ల్యూటీఓ అనుసరిస్తోన్న కొన్ని విధానాలు రైతులకు నష్టాన్ని కలిగిస్తోన్నాయని పేర్కొన్నాయి.