చైనీస్ నూడుల్స్ తిని 9 మంది మృతి - ఆ ఫుడ్ను చెత్తబుట్టలో పారేయండి - ఆరోగ్య శాఖ ఆదేశం
ప్రపంచం నలుమూలలకు విస్తరించిన చైనీస్ వంటకం నూడుల్స్ కు సంబంధించి మరో షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది సభ్యులు నూడుల్స్ తిని, ఆ సూప్ తాగడంతో మృత్యువాత పడ్డారు. నూడుల్స్ లో మోతాదుకు మించి ప్రమాదకర సీసం, యాసిడ్స్ ఉంటాయని ఇదివరకే కొన్ని ఆరోపణలు రాగా, వాటి తయారీ సంస్థలు వివరణలతో సరిపెట్టాయి. అయితే, ఈ ఘటనలో మాత్రం ఇంట్లో తయారు చేసుకున్న నూడుల్స్ ఆ కుటుంబం కొంపముంచాయి. దీనిపై ప్రభుత్వం తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. వివరాల్లోకి వెళితే..
ఏపీలో కరోనా: జగన్ సర్కారు సక్సెస్ - పెరిగిన రికవరీలు - కొత్తగా 3,746 కేసులు -10 రోజుల స్పెషల్ డ్రైవ్
సంప్రదాయ వంటకం..
నూడుల్స్ తిని ఒకే కుటుంబానికి చెందిన 9 మంది చనిపోయిన ఘటన చైనాలో చోటుచేసుకుంది. అక్కడి హెయిలాంగ్జియాన్ ఫ్రావిన్స్, జిడాంగ్ కౌంటీలో నూడుల్స్ తిన్న తొమ్మిది మంది చనిపోయినట్లు చైనీస్ అధికారిక మీడియా ప్రకటించింది. చైనాలో మొక్కజొన్న పిండితో తయారైన నూడుల్స్ తో వండే ‘స్వాన్ తాంగ్ జీ' వంటకాన్ని ఉదయం అల్పాహారంగా తీసుకుంటారు. అలా జిడాంగ్ కు చెందిన 12 మంది సభ్యుల కుటుంబం అక్టోబర్ 5న బ్రేక్ ఫాస్ట్ గా నూడుల్స్ సూప్ ను తీసుకున్నారు. దాని రుచి అదోలా ఉండటంతో ముగ్గురు మాత్రం నూడుల్స్ తినకుండా వదిలేశారు. తిన్న 9మంది గంటల వ్యవధిలోనే ఒకరితర్వాత ఒకరుగా ఆస్పత్రిపాలయ్యారు. సోమవారం నాటికి తొమ్మిదో వ్యక్తి చనిపోయారు.
అసలేం జరిగిందంటే..
సంప్రదాయ వంటకంగా భావించే ‘స్వాన్ తాంగ్ జీ' కోసం మొక్క జొన్న పిండితో నూడుల్స్ చేసి, వాటిని పులియబెడతారు(ఫెర్మెంటేషన్). ఇది సహజంగా జరిగే ప్రక్రియే అయినప్పటికీ, జిడాంగ్ లో మృత్యువాత పడిన ఆ కుటుంబం.. ఏడాదికి పైగా ఫ్రిజ్ లో ఉంచిన నూడుల్స్ ను వండి తినడం వల్లే ఫుడ్ పాయిజన్ జరిగినట్లు అధికారిక మీడియా తెలిపింది. ఎక్కువకాలం పులియబెట్టిన నూడుల్స్ లో బ్యాక్టీరియాల కారణంగా ప్రమాదకరమైన యాసిడ్స్ తయారవుతాయని, తిరిగి మరగబెట్టుకుని తిన్నా దాని ప్రభావం అలాగే ఉంటుందని, కాబట్టే ఆ 9 మంది ప్రాణాలు కోల్పోయారని డాక్టర్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే..
ఆ ఫుడ్ తినొద్దంటూ ఆదేశాలు..
ఒకే కుటుంబానికి చెందిన 9 మంది నూడుల్స్ పాయిజన్ వల్ల చనిపోవడంతో చైనా నేషనల్ హెల్త్ కమిషన్ (ఎన్హెచ్సీ) అప్రమత్తమైంది. ప్రజలెవరూ పులియబెట్టిన నూడుల్స్ ను తినొద్దని, ఇంట్లో నిల్వఉంచిన అలాంటి పదార్థాలను వెంటనే చెత్తబుట్టలో పారేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఫెర్మెంటేషన్ ఫుడ్ సేఫ్ కాదని, గడిచిన 10 ఏళ్లలో మొత్తం 84 మంది పాయిజన్ కు గురికాగా, 37 మంది ప్రాణాలు కోల్పోయారని ఎన్హెచ్సీ పేర్కొంది. అయితే దీనిపై చైనీస్ సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
జస్టిస్ రమణేనా? రెడ్డి జడ్జిలపై రాయరా? - జగన్ నోట తప్పులు -2వ తేదీలోగా ఈపని: ఎంపీ రఘురామ