న్యూజిలాండ్ కాల్పులు: 9 మంది భారతీయులు మిస్సింగ్... అందులో ఒకరు హైదరాబాదీ
క్రైస్ట్ చర్చ్ : న్యూజిలాండ్లోని క్రైస్ట్ చర్చ్ మసీదులో ఉగ్రవాది జరిపిన కాల్పుల్లో 49 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.ఇందులో 9 మంది భారతీయు అదృశ్యమైనట్లు న్యూజిలాండ్కు భారత దౌత్యవేత్త సంజీవ్ కోహ్లీ ట్వీట్ చేశారు. అయితే ఇంకా ఎంతమంది కనిపించకుండ పోయారనేది అధికారికంగా ప్రకటించాల్సి ఉందని కోహ్లీ ట్వీట్ చేశారు. మానవత్వం లేకుండా జరిగిన ఈ దాడిని ఖండిస్తున్నట్లు కోహ్లీ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు సంజీవ్ కోహ్లీ ట్వీట్ చేశారు.
ఇదిలా ఉంటే న్యూజిలాండ్ దాడులను ఖండిస్తూ ఆదేశ ప్రధాని జాసిండా ఆర్డర్న్కు భారత ప్రధాని నరేంద్ర మోడీ లేఖ రాశారు. ఉగ్రవాదంపై భారత్ పోరాడుతోందని ఆయన లేఖలో తెలిపారు. ఇలాంటి దాడులను ఎవరూ హర్షించరని అన్నారు. విద్వేషాలకు, హింసకు ప్రజాస్వామ్యంలో స్థానం లేదని ప్రధాని తన లేఖలో పేర్కొన్నారు. మరోవైపు న్యూజిలాండ్లోని భారత దౌత్యకార్యాలయం భారతీయులకు సహాయం చేసేందుకు ముందుకొచ్చింది.
As per updates received from multiple sources there are 9 missing persons of indian nationality/ origin. Official confirmation still awaited. Huge crime against humanity. Our prayers with their families
— sanjiv kohli (@kohli_sanjiv) March 15, 2019
మరోవైపు ఉగ్రవాది కాల్పుల్లో గాయపడినవారిలో హైదరాబాదుకు చెందిన అహ్మద్ జహంగీర్ అనే వ్యక్తి ఉన్నాడంటూ మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేశారు. తాను చేసిన ట్వీట్ను విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్కు ట్యాగ్ చేశారు. వెంటనే అతని మృతదేహాన్ని భారత్కు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. అహ్మద్ కుటుంబం నుంచి అతని సోదరుడు న్యూజిలాండ్ వెళ్లాలని భావిస్తున్నాడని వెంటనే వీసాను ఏర్పాటు చేయాలని అసదుద్దీన్ కేటీఆర్ను సుష్మాస్వరాజ్ను కోరారు.
న్యూజిలాండ్ కాలామానం ప్రకారం మధ్యాహ్నం రెండు మసీదుల్లో సాయుధలైన దుండగులు విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డ సంగతి తెలిసిందే.మసీదుల్లో జరిపిన కాల్పులు ఉగ్రవాదులని అర్థమవుతోందన్నారు ప్రధాని ఆర్డెన్. శుక్రవారం రోజున .. ముస్లీంలు ప్రార్థనలు చేస్తూ గుమిగూడిన నేపథ్యంలో పక్కా ప్రణాళికతో దాడికి తెగబడ్డారని న్యూజిలాండ్ ప్రధాని అన్నారు. దాడికి పాల్పడిన నలుగురిని ఇప్పటికే భద్రతాదళాలు అదుపులోకి తీసుకున్నాయని తెలిపారు. వీరిలో ముగ్గురికి కాల్పులతో సంబంధం ఉన్నదని పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు బ్రెంటన్ టారాంట్ (28) తనది ఆస్ట్రేలియా అని చెప్పాడని పేర్కొన్నారు. వారి వద్ద రెండు కారు బాంబులు లభించాయని .. వాటిని రక్షణశాఖ వర్గాలు నిర్వీర్యం చేశాయని తెలిపారు.