ట్రంప్కు కోర్టులో మరో దెబ్బ, మోడీ అమెరికా పర్యటన.. ప్రాధాన్యత
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మరో షాక్ తగిలింది. ఆయన తీసుకు వచ్చిన ట్రావెన్ బ్యాన్ను నిలిపివేస్తూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమెరికా అప్పీల్స్ న్యాయస్థానం సమర్థించింది.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మరో షాక్ తగిలింది. ఆయన తీసుకు వచ్చిన ట్రావెన్ బ్యాన్ను నిలిపివేస్తూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమెరికా అప్పీల్స్ న్యాయస్థానం సమర్థించింది.
ఆరు దేశాలకు చెందిన ప్రజలు అమెరికాలోకి ప్రవేశించకుండా ట్రంప్ ప్రభుత్వం 90 రోజుల పాటు ఆంక్షలు విధించింది. ఈ ఆదేశాలు వివక్షతో కూడుకున్నవని హవాయి రాష్ట్రం కోర్టును ఆశ్రయించింది.
దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం దీనిపై ఇంజెక్షన్ ఆర్డరును జారీ చేసింది. ఇరాన్, సోమాలియా, లిబియా, సూడాన్, సిరియా దేశాల ప్రజలపై ట్రంప్ విధించిన ట్రావెల్ బ్యాన్ రాజ్యాంగ విరుద్ధమని ఫెడరల్ అప్పీల్స్ కోర్టు స్పష్టం చేసింది.
ఈ బిల్లులో జాతీయ భద్రతే లక్ష్యంగా కనిపిస్తున్నప్పటికీ, మతపరమైన వివక్ష, అసహనం, వ్యతిరేక ధోరణి స్పష్టంగా కనిపిస్తున్నాయని అభిప్రాయపడింది.
కింది కోర్టు ఇచ్చిన తీర్పును బలపరుస్తూ, డొనాల్డ్ ట్రంప్ ఆర్డరును నిలిపివేసింది. అయితే ఫెడరల్ అప్పీల్స్ కోర్టు తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశముందని తెలుస్తోంది. ట్రంప్ ప్రభుత్వం తొలుత ఏడు ముస్లీం దేశాలపై నిషేధం విధించింది. నిర్ణయంపై వ్యతిరేకత రావడంతో జాబితా నుంచి ఇరాక్ను తొలగించింది.
మరోవైపు, ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ఖరారయింది. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు మోడీ ఈ నెల 25, 26 తేదీల్లో వాషింగ్టన్లో పర్యటిస్తారు. రక్షణ వ్యవహారాల్లో సహకారం, అమెరికాతో వాణిజ్యం తదితర అంశాలపై మరిన్ని ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశముంది. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ వెళ్లడం తొలిసారి. ఓ వైపు హెచ్1బి వీసా నిబంధనలు కఠినతరం చేయడం, మరోవైపు ప్యారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగిన నేపథ్యంలో మోడీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.