రాజన్ ల్యాప్టాప్లో దావూద్ రహస్యాలు?
బాలి: మాఫియా డాన్ ఛోటా రాజన్ ఉపయోగిస్తున్న ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్ ను భారత్ సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇండోనేషియాలోని బాలిలో మాఫియా డాన్ ఛోటా రాజన్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఛోటా రాజన్ ను భారత్ తీసుకురావడానికి భారత్ సీబీఐ, ముంబై, ఢిల్లీ పోలీసు అధికారులు బాలి చేరుకున్నారు. బాలి పోలీసు అధికారుల దగ్గర ఉన్న ఛోటా రాజన్ ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్ ను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అందులో ఛోట రాజన్, అతని గ్యాంగ్ తో పాటు దావూద్ ఇబ్రహీంకు చెందిన డీ గ్యాంగ్ వివరాలు ఉండే అవకాశం ఉందని సీబీఐ అధికారులు అంటున్నారు. ఇంటర్ పోల్ సమాచారం ఇవ్వడంతో ఇండోనేషియాలోని బాలి అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు ఛోటా రాజన్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఛోటా రాజన్, దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ ల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అలాంటి సమయంలో దావూద్, అతని అనుచరుల కార్యకలాపాల గురించి ఛోటా రాజన్ తన ల్యాప్ టాప్ లో రహస్య వివరాలు పెట్టి ఉంటాడని అధికారులు అంటున్నారు.
ఛోటా రాజన్ ను అతి త్వరలో భారత్ రప్పించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సీబీఐ అధికారులు అంటున్నారు. ఛోటా రాజన్ ల్యాప్ టాప్, మొబైల్ లో డీ గ్యాంగ్ రహస్యాలు ఉంటే వారిని ఏలాగైనా అరెస్టు చెయ్యాలని అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టారు.