చితికిపోయిన పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ..! పాక్ సుప్రీం కోర్టు ప్రధానన్యాయమూర్తి వ్యాఖ్యలు..!!
ఇస్లామాబాద్/హైదరాబాద్ : పాకిస్తాన్ లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం పై ఆదేశంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇమ్రాన్ ప్రభుత్వంపైన ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు ఆర్థిక నిపుణులు. పాకిస్థాన్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఆ దేశ సుప్రీం కోర్టు న్యాయమూర్తి అసిఫ్ సయీద్ ఖోసా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ కప్లో భాగంగా టీమిండియా చేతిలో ఆ జట్టు ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపైనా ఆయన మాట్లాడారు. పాకిస్థాన్ మోడల్ కోర్టుల అభివృద్ధిమీద ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వంపై పరోక్షంగా మండిపడ్డారు. దేశంలోని అన్ని వ్యవస్థలు గాడి తప్పాయన్నారు. ఆర్థిక వ్యవస్థ నుంచి క్రికెట్ సంఘం వరకు అన్నింట్లోనూ సంక్షోభం నెలకొందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
'పాకిస్థాన్లో ఆర్థిక వ్యవస్థ గతి తప్పింది. నిధుల సేకరణకు మునుపెన్నడూ లేని విధంగా వస్తువులను, కొన్ని పరికరాలను అమ్మకానికి పెట్టారు. నాకు తెలిసి దేశంలో ఇలాంటి దుస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదు. పాక్ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉందో లేదా ఐసీయూ నుంచి బయటకు వచ్చిందో అర్థం కావడం లేదు. నిధుల చెల్లింపులు నిలిచిపోయాయి. ఇక పార్లమెంటులో హింస తప్ప మరేమీ లేదు. అధికార పక్షానికి, ప్రతిపక్షానికి మధ్య సఖ్యత లేదు. ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశమే ఇవ్వడం లేదు. ఇక ప్రపంచ కప్ను చూసుకుంటే అక్కడా పాకిస్థాన్ వైఫల్యమే కనిపిస్తోంది. జట్టు మేనేజ్మెంట్ను మార్చాం. క్రికెట్ రంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చినప్పటికీ తేరుకోలేకపోతోంది. ఇండియాతో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు చేతిలో పాక్ చావు దెబ్బ తిన్న విషయం తెలిసిందే. దీంతో సామాజిక మాధ్యమాల్లోనూ వారికి చీవాట్లు తప్పడం లేదు. టీవీ, ఇతర ప్రసార మాధ్యమాలను చూడాలంటే భయమేస్తోంది. అన్ని వ్యవస్థలు గాడి తప్పినప్పటికీ ఒక్క న్యాయ వ్యవస్థ మాత్రం కాస్త ఊరట నింపేలా కనిపిస్తోంది. ఇక్కడ మాత్రమే 100% సానుకూలత కనిపిస్తోంది' అని వ్యాఖ్యానించారు.