కశ్మీర్లో యూఎన్ జోక్యం లేదు.. పాక్పై ఉన్న ఈ తీర్మానమే అడ్డంకిగా నిలుస్తోందా..?
కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితి జోక్యం కోరుతూ పదేపదే పాకిస్తాన్ ఒత్తిడి తీసుకొస్తోంది. అయితే అది అంత సులభం కాదు. ఎందుకంటే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఉన్న ఓ నిబంధన దీనికి అడ్డంకిగా మారింది. దీన్ని ఇంగ్లీషులో కిల్లర్ క్లాజ్గా అభివర్ణిస్తారు. ఇంతకీ ఏంటా క్లాజ్ ..? పాక్కు ఎందుకు అడ్డంకిగా మారింది..?
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తీర్మానం
కశ్మీర్ పై నిర్ణయం జరగాలంటే ఆ రాష్ట్రంలోని ప్రజాభిప్రాయం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందనే తీర్మానం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఉంది. అంతేకాదు తీర్మానం ప్రకారం జమ్ము కశ్మీర్లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలంటే ముందుగా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న తన సైన్యంతో పాటు పాక్ ఆక్రమిత కశ్మరీ పీఓకేలో సెటిల్ అయిన ఆదేశ పౌరులను తమ భూభాగంలోకి వెనక్కు రప్పించుకోవాల్సి ఉంటుంది. రిజల్యూషన్ 47గా పిలువడుతున్న ఈ తీర్మానంను 1948 ఏప్రిల్ 21న ఐక్యరాజ్య సమితిలో తైవాన్ ప్రవేశపెట్టింది.
క్లాజ్ 47లో తీర్మానంలో ఏముంది..?
ప్రజాభిప్రాయ సేకరణను మూడంచెలుగా చేయాలనేదే తీర్మానం ముఖ్య ఉద్దేశం. ఈ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో నివాసముంటున్న పాక్ గిరిజనులు, పాకిస్తానీ జాతీయులు, ఇతర పాక్ నివాసితులను వెంటనే ఖాళీ చేయించాల్సి ఉంటుందని తీర్మానంలో పేర్కొన్నారు. వీరంతా చొరబాట్లను అడ్డుకునేందుకు వచ్చి అక్కడే స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నవారని తెలుస్తోంది. అయితే ఓ కమిటీ ఏర్పాటు చేసిన తర్వతే పాకిస్తాన్ గిరిజనులు అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోయారు. అనంతరం భారత్ తన బలగాలను క్రమంగా తగ్గించుకుంటూ వచ్చింది. కేవలం పౌరుల భద్రత కోసం సరిపడా భద్రతా సిబ్బందిని మాత్రమే అక్కడ ఉంచింది. ఇదే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానంలో పొందుపర్చారు.
విభజన సమయంలో కశ్మీర్ను ఆక్రమించే ప్రయత్నం చేసిన పాక్
అయితే పాకిస్తాన్ కోరుతున్నట్లుగా కశ్మీర్ విషయంలో ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలంటే ముందుగా పీఓకేలో సెటిల్ అయిన పాక్ దేశస్తులను, సైన్యంను ఖాళీ చేయించాకే ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుని ఆపై ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఈ సవాలును అధిగమిస్తే కానీ ఎలాంటి ముందడుగు పడదనేది స్పష్టమవుతోంది. అయితే దేశ విభజన సమయంలో కశ్మీర్ స్వతంత్ర దేశంగా ఉంటామని చెప్పినప్పుడు భారత్ జోక్యం చేసుకోలేదు. అయితే పాకిస్తాన్ మాత్రం బలవంతంగా కశ్మీర్ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించింది. ఇందులో భాగంగా కొందరు గిరిజనులకు సైన్యంను తోడుగా ఇచ్చి దండయాత్రకు పంపింది. దీంతో కశ్మీర్ మహారాజ హరిసింగ్ భారత్లోకి కశ్మీర్ను విలీనం చేస్తామని చెప్పి భారత సైన్యం సహాయం తీసుకున్నారు. ఇదే విషయం కశ్మీర్ పునర్విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన సమయంలో ఉభయసభలను కుదిపేసింది.