బ్యాంకాక్ బాంబు పేలుడు నిందితుడి గుర్తింపు !
బ్యాంకాక్: థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ లో జరిగి బాంబు పేలుడు నిందితుడిని అధికారులు గుర్తించారు. అతనిని అరెస్టు చెయ్యడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి బ్యాంకాక్ లో గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
సోమవారం సాయంత్రం బ్యాంకాక్ కాలమానం ప్రకారం 7 గంటల సమయంలో కమర్షియల్ హబ్ లో బ్రహ్మదేవుని ఆలయానికి అత్యంత సమీపంలో బాంబు పేలుడు జరిగింది. ఈ బాంబు పేలుడులో 22 మంది మరణించారని, 125 మందికి తీవ్రగాయాలైనాయని బ్యాంకాక్ పోస్టు మీడియా వెల్లడించింది.
ఆలయానికి అతి సమీపంలోని ఒక కమర్షియల్ మాల్ దగ్గర ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పుటేజ్ లు పోలీసు అధికారులు పరిశీలించారు. ఆ క్లిప్పింగ్ లలో ఒక వ్యక్తి బాంబు తీసుకు వచ్చి అక్కడ పెట్టి వెళుతున్న విషయం గుర్తించామని అధికారులు అంటున్నారు.
అయితే సీసీ కెమెరాలలో ఆ వ్యక్తి సరిగ్గా కనపడటం లేదని అధికారులు చెప్పారు. థాయ్ లాండ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్న సంస్థలో అతను పని చేస్తున్నాడనే విషయం గుర్తించామని చెప్పారు. బాంబు పేలుడు సంఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసు అధికారులు తెలిపారు.
టూరిజంపై ప్రభావం............!
బ్యాంకాక్ లో పర్యటించే విదేశీయులను లక్ష్యంగా చేసుకుని బాంబు పేలుడు సృష్టించారని ఆ దేశ రక్షణ శాఖ మంత్రి వాంగ్ సువాంగ్ అన్నారు. బాంబు పేలుడులో విదేశీయులు మరణించారని స్పష్టం చేశారు. 5 కేజీల టీఎన్ టీ బాంబు పేల్చారని పోలీసు అధికారులు తెలిపారు.
40 అడుగుల విస్తీర్ణంలో ఈ బాంబు పేలుడు ప్రభావం పడిందని పోలీసు అధికారులు చెప్పారు. ఇదే బాంబు పేలుడు ప్రాంతంలో గాయాలైన ఇరాన్ కు చెందిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఇరాన్ ఉగ్రవాదులు దాడులు చేసి ఉంటారని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.