హైవేపై కుప్పకూలిన విమానం: నలుగురి దుర్మరణం
న్యూయార్క్: విమానం కుప్పకూలిపోయి నలుగురు సజీవదహనం అయిన సంఘటన అమెరికాలో జరిగింది. అమెరికాలోని అట్లాంటాలో నిత్యం రద్దిగా ఉండే హైవే మీద విమానం కూలిన సమయంలో ఎలాంటి వాహనాలు సంచరించకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) అధికారుల కథనం ప్రకారం శుక్రవారం రాత్రి చాంబ్లీ నగరం సమీపంలోని డెకాట్- పిచ్ ట్రీ ఎయిర్ పోర్టు నుండి సింగిల్ ఇంజిన్ ఉన్న తేలిక పాటి విమానం బయలుదేరింది.
తరువాత అట్లాంటలోని ఇంటర్ స్టేట్ హైవే-285 రహదారి దగ్గర విమానం నియత్రణ కోల్పోయింది. పైలెట్ విమానం అదుపులోకి తీసుకురావడానికి విఫలయత్నం చేశారు. అయితే అది వీలు కాకపోవడంతో విమానం ఒక్క సారిగా హై వే మీద కుప్పకూలిపోయింది.
విమానం కూలిపోయిన సమయంలో అక్కడ ఎలాంటి వాహనాలు లేవని ఎఫ్ఏఏ అధికారిని కత్లీన్ బెర్జిన్ చెప్పారు. విమాన ప్రమాదం జరిగిన తరువాత 285 హైవేలో రెండు వైపుల వాహన సంచారాన్ని నిషేధించారు. మంటలు అదుపు చెయ్యడానికి సహాయక బృందాలు రంగలోకి దిగాయి. విమాన శకలాలు అక్కడి నుండి తరలించారు. విమానం కూలిపోవడానికి ఖచ్చితమైన కారణాలు తెలియడం లేదని అధికారులు అంటున్నారు.