బాబోయ్: గాలిలో కరోనా వైరస్...ఆధారాలు ఉన్నాయి: ప్రపంచ ఆరోగ్య సంస్థను హెచ్చరించిన నిపుణులు
జెనీవా: కరోనావైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. గత నెల వరకు లాక్డౌన్ విధించి చాలా కఠినంగా వ్యవహరించిన ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఆంక్షలు సడలించడంతో భారత్తో సహా చాలా ప్రపంచదేశాల్లో ఈ మహమ్మారి ప్రతాపాన్ని చూపుతోంది. ఫలితంగా కొన్ని లక్షల మంది కోవిడ్-19 బారిన పడి బలవుతున్నారు. వ్యాధి చాలా వేగంగా ప్రబలుతున్న నేపథ్యంలో 239 మంది నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు ప్రపంచ ఆరోగ్యసంస్థకు లేఖ రాశారు.
Recommended Video
కరోనావైరస్ మహమ్మారి తర్వాత భవిష్యత్ ఉద్యోగాలు ఎలా ఉంటాయి?
గాలిలో కరోనావైరస్
కరోనావైరస్ వ్యాప్తిపై 239 మంది నిపుణుల బృందం ప్రపంచ ఆరోగ్య సంస్థకు లేఖ రాసినట్లు ప్రముఖ అంతర్జాతీయ పత్రిక న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో ప్రచురించింది. వైరస్ గాలిలో వ్యాప్తి చెందిందని దీంతో చాలామందికి ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని నిపుణులు తమ లేఖలో ప్రపంచఆరోగ్య సంస్థను అలర్ట్ చేసినట్లు న్యూయార్క్ పత్రిక తన కథనంలో ప్రచురించింది. వైరస్ గాలిలో వ్యాప్తి చెందింది అని చెప్పేందుకు ఆధారాలు కూడా ఉన్నాయని స్పష్టం చేసింది నిపుణుల బృందం. ఒక వ్యక్తి తుమ్మడం ద్వారా ఆ సూక్ష్మ బిందువులు పెద్ద సంఖ్యలో గాల్లో కలిసి ప్రమాదంకు దారితీస్తున్నాయని వారు హెచ్చరించారు. గాలిలో ఉన్న సమయంలో ప్రజలు శ్వాస తీసుకున్నప్పుడు ఇది ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్యసంస్థను అలర్ట్ చేసింది బృందం.
తక్కువ వెంటిలేషన్, ఎక్కువ జనసాంద్రత
ఇక వెంటనే ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన జాగ్రత్తలను సూచనలను పునఃసమీక్షించి కొత్త రికమెండేషన్స్ను విడుదల చేయాలని 32 దేశాలకు చెందిన శాస్త్రవేత్తల బృందం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ను కోరింది. ఒకవేళ గాలిలో ఈ వైరస్ కలిసిపోయిందంటే పెను ప్రమాదం ఎదుర్కోవాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లేదా తక్కువ వెంటిలేషన్ ఉన్న ప్రాంతాల్లో ఈ వైరస్ మరింత విరుచుకుపడే ప్రమాదం ఉదని ప్రపంచ ఆరోగ్యసంస్థను అలర్ట్ చేసింది. ఇక ఇళ్లల్లో ఉన్న సమయాల్లో కూడా మాస్కులు తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుందని సూచించడమే కాకుండా ... ఇళ్లల్లో కూడా భౌతిక దూరంను పాటించేలా సూచనలు చేయాలని శాస్త్రవేత్తల బృందం ప్రపంచఆరోగ్య సంస్థను కోరింది.
హెల్త్ వర్కర్లు ఎన్-95 మాస్కులు ధరించాలి
కరోనావైరస్ పేషెంట్ల కోసం ముందుండి సేవ చేస్తున్న హెల్త్ వర్కర్లకు తప్పనిసరిగా ఎన్ 95 మాస్కులు ధరించేలా నిబంధనలు తీసుకురావాలని ప్రపంచ ఆరోగ్యసంస్థను శాస్త్రవేత్తల బృందం కోరింది. కరోనావైరస్ పేషంట్లకు సమీపంలో హెల్త్ వర్కర్లు సేవలందిస్తుంటారు కాబట్టి సూక్ష్మ బిందువులను కూడా ఈ ఎన్-95 మాస్కులకు ఫిల్టర్ చేసే సామర్థ్యం ఉండటంతో వీరు సురక్షితంగా ఉంటారని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇక స్కూళ్లు, నర్సింగ్ హోమ్స్, ఇళ్లు ఇతర వాణిజ్య సముదాయాల్లో వెంటిలేషన్ వ్యవస్థ బాగా ఉండేలా చూసుకోవాలని లేఖలో సూచించింది. వెంటిలేషన్ బాగా ఉంటే ఈ సూక్ష్మ బిందువులు అక్కడక్కడే ఉండే అవకాశం లేదని పేర్కొంది. ఇక ఇళ్లల్లో లేదా ఇతర గదుల్లో సూక్ష్మ బిందువులను చంపేందుకు అల్ట్రావైలెట్ లైట్లు అవసరం అవుతాయని శాస్త్రవేత్తల బృందం ప్రపంచ ఆరోగ్యసంస్థకు సూచించింది.