మరో వందేళ్లలో హిమాలయ పర్వతాల్లో మూడోంతుల మంచు మాయం!
న్యూఢిల్లీ: హిమాలయ పర్వతశ్రేణుల్లో మూడో వంతు మంచుకొండలు కరిగిపోనున్నాయి. 2100 సంవత్సరం లోపు ఈ పర్వతాల్లోని మంచుకొండలు అడుగంటిపోతాయని ఓ సర్వే హెచ్చరికలు జారీ చేసింది. గ్లోబల్ వార్మింగ్ను ఈ శతాబ్దంలోపు 1.5 సెంటీగ్రేడ్ల వరకు కట్టడి చేసినా హిందూకుష్ పర్వతాల్లోని మంచు మూడోవంతు కరుగుతుందని ఖాట్మాండుకు చెందిన ఐసీఐఎంవోడీ సంస్థ తన నివేదికలో తెలిపింది.
హిమాలయాలతో పాటు కరక్కోణం ప్రాంతాలలో సగటున 0.7 శాతం ఉష్ణోగ్రతలు పెరుగుతాయని సర్వేలో తేలింది. టిబెట్ పీఠభూమి, మధ్యశ్రేణి హిమాలయాలు, కరక్కోణం ప్రాంతాలు హిందూకుష్ కంటే ఎక్కువ వేడి ఎక్కనున్నాయని తెలిపారు. దాదాపు 350 మంది పరిశోధకులు హిందూకుష్ పైన డ్రాఫ్ట్ తయారు చేశారు.
మరో వంద సంవత్సరాల్లో హిందూకుష్లో మంచు కరిగిపోయి, కేవలం కొండ ప్రాంతంగా మారుతుందని ఆ నివేదికలో తేలిపింది. ఎనిమిది దేశాల్లో హిందుకుష్ పర్వతాలు విస్తరించాయి. భారత్, చైనా, నేపాల్, మయన్మార్, భూటాన్, బంగ్లాదేశ్, ఆప్గనిస్తాన్, పాకిస్తాన్లకు విస్తరించాయి.
ఉష్ణోగ్రతలకు తోడు వాయుకాలుష్యం కారణంగా హిమాలయాలు కరుగుతున్నట్లు తెలిపింది. మంచు కరగడం వల్ల 2050 వరకు గంగా, బ్రహ్మపుత నదుల ప్రవాహం ఎక్కువగా ఉండనుందని సర్వే తేల్చింది.