ఆధార్ అద్భుతం, ఇతర దేశాలు ప్రవేశపెట్టాలి: బిల్ గేట్స్, ‘ప్రైవసీకి భంగం కాదు’
న్యూయార్క్: మనదేశంలో ఆధార్ కార్డు వ్యక్తిగత గోప్యత(ప్రైవసీ) గురించి తీవ్రమైన చర్చ జరుగుతుండగా.. ఆధార్ కార్డు ఓ అద్భుతమని కొనియాడారు ప్రపంచ ధనవంతుడు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్. అంతేగాక, ఆధార్ లాంట్ గుర్తింపు కార్డును ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా తీసుకురావాలని అన్నారు.
ఆధార్ టెక్నాలజీతో వ్యక్తిగత భద్రతకు ఎలాంటి ముప్పు ఉండదని అభిప్రాయపడ్డారు. ఆధార్ లాంటి గుర్తింపు కార్డును ఇతర దేశాల్లో ప్రవేశపెట్టేందుకు వరల్డ్ బ్యాంక్కు తమ బిల్, మిలిందా గేట్స్ ఫౌండేషన్ నుంచి విరాళాలు కూడా ఇచ్చారు. ఇండియాలో ఆధార్ తీసుకొచ్చిన నందన్ నీలేకని ఈ ప్రాజెక్ట్ విషయంలో వరల్డ్ బ్యాంక్కు సాయం చేస్తున్నట్లు గేట్స్ వెల్లడించారు.
ఆధార్తో చాలా లాభాలు ఉన్నాయని కూడా గేట్స్ తెలిపారు. ఇతర దేశాలూ ఇండియాలో ప్రవేశపెట్టిన ఆధార్ లాంటి కార్డులను జారీ చేయాలని, ఏ ప్రభుత్వమైనా తమ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలన్నా.. ప్రజలను శక్తివంతులను చేయాలన్నా నాణ్యమైన పాలన చాలా అవసరమని అన్నారు. దానికి ఇలాంటి వ్యవస్థ ఉపయోగపడుతుందని అన్నారు.
ఆధార్ ప్రైవసీపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి కదా అని ప్రశ్నిస్తే.. ఆధార్తో ప్రైవసీకి ఎలాంటి భంగం వాటిల్లదని, ఎందుకంటే ఇది కేవలం ఓ బయో ఐడీ వెరిఫికేషన్ స్కీమ్ మాత్రమేనని గేట్స్ తెలిపారు.
కాగా, గతంలో నీతి అయోగ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కూడా ఆధార్పై గేట్స్ ప్రశంసలు కురిపించారు. ప్రపంచంలోని ధనిక దేశాలు కూడా ఇలాంటి వ్యవస్థను తీసుకురాలేదని వ్యాఖ్యానించారు. కాగా, ఇప్పటికే పొరుగు దేశాలతోపాటు మరికొన్ని దేశాలు కూడా ఆధార్ లాంటి కార్డు తీసుకొచ్చే విషయంలో సాయం చేయాల్సిందిగా ఇండియాను కోరాయి.