హస్తినలో హ్యాట్రిక్: సర్కార్ సామాన్యుడిదే: ఆమ్ఆద్మీ ప్రభుత్వ ఏర్పాటు లాంఛనమే..!
Recommended Video
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ఆశించినపట్టుగా ఎలాంటి అద్భుతాలు చోటు చేసుకోలేదు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజం అయ్యాయి. హస్తిన మరోసారి ఆమ్ఆద్మీ వశం కాబోతోంది. దేశ రాజధానిలో ఆమ్ఆద్మీ పార్టీ మరోసారి అధికారాన్ని ఏర్పాటు చేయడం ఖాయమైంది. ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ను ఆమ్ఆద్మీ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. ఫలితంగా- ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలో న్యూఢిల్లీలో మరోసారి ఆమ్ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుండటం ఇక లాంఛన ప్రాయమే.
వరుసగా మూడోసారి..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు ఆరంభమైంది. మొత్తం 21 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే వెలువడుతున్నాయి. ప్రారంభం నుంచీ ఆమ్ఆద్మీ పార్టీ తన దూకుడును ప్రదర్శించింది. 2015 నాటి ఎన్నికల ఫలితాలతో పోల్చుకుంటే..కొన్ని సీట్లను కోల్పోయినప్పటికీ..ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థానాలను అందుకుంది. భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది.
70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో..
మొత్తం 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సీట్ల సంఖ్య 36. తొలి గంటలోనే ఆమ్ఆద్మీ పార్టీ ఈ మేజిక్ ఫిగర్ను అందుకుందంటే.. ఆ పార్టీ దూకుడు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తన ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశాన్నే ఇవ్వలేదు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తొలి గంటన్నర వ్యవధిలో ఆమ్ఆద్మీ పార్టీకి 43 సీట్లలో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. బీజేపీ 16 స్థానాలకు పరిమితమైంది.
డీలా పడ్డ కమలం..
ఈ సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ధీమాను కనపరిచిచన కమలనాథులు డీలా పడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీకి కనీసం పోటీ ఇవ్వలేకపోయారు. ఆమ్ఆద్మీ పార్టీ ఎన్నికల వ్యూహాలను తుత్తునీయలు చేశామని, అరవింద్ కేజ్రీవాల్ ఆయన టీమ్ను చిత్తుగా ఓడిస్తామంటూ ధీమాగా ఉన్న బీజేపీ నేతలకు ఈ ఫలితాలు నిరాశనే మిగిల్చాయి. కనీసం పోటీ ఇవ్వలేని పరిస్థితిలో కనిపిస్తోంది. 2015 నాటి సీట్లతో పోల్చుకుంటే.. కొద్దగా మెరుగు పడిందే తప్ప, ధీటుగా ఢీ కొట్టలేకపోయింది.
కాంగ్రెస్ పరిస్థితి మరీ దారుణం..
కాంగ్రెస్ పరిస్థితి మరీ దారుణంగా మారిపోయింది. వరుసగా మూడు సార్లు ఢిల్లీని ఏలిన హస్తం పార్టీ.. కనీసం ఖాతాను కూడా తెరవలేని దుస్థితికి దిగజారింది. ఆ పార్టీ అభ్యర్థులు ఒకే ఒక్క స్థానంలో ముందంజలో కొనసాగుతున్నారు. అదీ స్వల్ప ఆధిక్యమే కావడం వల్ల విజయంపై ఆశల్లేవనే అంటున్నారు. 15 సంవత్సరాల పాటు ప్రభుత్వాన్ని నడిపిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓటు బ్యాంకు మొత్తం ఆమ్ ఆద్మీ పార్టీ కొల్లగొట్టడమే ఈ పరిస్థితి కారణమైందని చెబుతున్నారు.