జపాన్లో మోడీ, చైనాలో షింజో అబే: మారుతున్న అంతర్జాతీయ సంబంధాలు
టోక్యో: అంతర్జాతీయ సంబంధాలు ప్రస్తుతం జంక్షన్లో జామ్ అయి ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబర్ 27న జపాన్ పర్యటనకు బయలు దేరి వెళ్లారు. జపాన్ ప్రధాని షింజో అబేతో ద్వైపాక్షిక చర్చల కోసం ఆయన జపాన్ వెళ్లడం జరిగింది. ఇద్దరు వ్యక్తిగతంగా కూడా మంచి స్నేహితులు. జపాన్ ప్రధాని అబేతో భేటీ కావడం ఇది 12వ సారి. తొలిసారిగా ప్రధాని మోడీ షింజో అబేతో సెప్టెంబర్ 2014లో తూర్పు ఆసియా దేశాల సమావేశం సందర్భంగా కలిశారు. ఇదిలా ఉంటే మోడీ జపాన్లో అడుగు పెట్టిన కొన్ని గంటల వ్యవధిలో జపాన్ ప్రధాని షింజో అబే చైనా పర్యటన ముగించుకుని జపాన్లో ల్యాండ్ అయ్యారు.
జపాన్ భారత్లకు ఉమ్మడి మిత్రదేశంగా చైనా..?
చైనా జపాన్ దేశాలు రెండు శత్రుదేశాలే. 2014లో చైనాను శత్రుదేశంగా చూస్తూ మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్ల తర్వాత అదే చైనాలో ఒక మంచి మిత్రుడిని మోడీ చూస్తున్నారు. జపాన్, భారత్లకు ఉమ్మడి స్నేహుతునిగా చైనా మారింది. అయితే ఇక్కడ గమనించాల్సింది రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు. కేవలం స్వప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. ఇదిలా ఉంటే జపాన్ ప్రధాని షింజో అబే చైనా పర్యటనకు వెళ్లారంటే అదేదో సంబంధాలు నెరుపుదామని కాదని... శాంతి మంత్రం పటించేందుకు అన్ని ఆసియా దేశాలు ఒకే తాటిపైకి రావాలనే మంచి ఉద్దేశంతోనే పర్యటనకు వెళ్లారని జపాన్ మీడియా పేర్కొంది.
అమెరికా జోక్యాన్ని సహించలేకున్న ఆసియా దేశాలు
అగ్రరాజ్యం అమెరికా అన్ని దేశాలపై ఆధిపత్యం చెలాయించడం, ఆంక్షలు విధించడాన్ని పలు ఆసియా దేశాలు జీర్ణించుకోలేక ఉన్నాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతర్గత వ్యవహారాల్లో కలగజేసుకోవడం ఎంతమాత్రం ఇంపింతం కాదని ఆసియా దేశాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే రాజకీయ అంశాలు, దౌత్యపరమైన అంశాలు, ఆర్థికపరమైన అంశాలపై కలుగజేసుకుంటుండటంతో అన్ని ఆసియా దేశాలు తమ విదేశీ విధానాల్లో మార్పులు తీసుకురావాలని భావిస్తున్నాయి. డొక్లాం వివాదంతో చైనాతో విబేధాలు తలెత్తినప్పటికీ భారత ప్రధాని మోడీ చైనాలో పర్యటించారు. ఇద్దరు అనధికార సమావేశం నిర్వహించి డొక్లాం వివాదంపై చర్చించారు. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్తో సోచిలో సమావేశమయ్యారు మోడీ.
చైనాతో జపాన్ 500 ఒప్పందాలు
జపాన్ ప్రధాని షింజో అబే కూడా ఈ నేపథ్యంలోనే చైనా పర్యటనకు వెళ్లారు. రెండు దేశాలు 500కు పైగా ఒప్పందాలు చేసుకున్నాయి. జపాన్ ప్రధాని చైనాకు వెళ్లడం గత ఏడేళ్లలో ఇదే తొలిసారి. చైనా జపాన్ ఒప్పందాలతో ట్రంప్కు చెక్ పెట్టొచ్చని కొందరు అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక విధంగా చూస్తూ అమెరికా పెత్తనం చెలాయిస్తుండటంతోనే శత్రుదేశాలు అన్ని మిత్రులుగా మారుతున్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది ఇలానే కొనసాగితే అమెరికా ఒంటరి దేశంగా మిగిలిపోవడం ఖాయంగా కనిపిస్తోందని వారు జోస్యం చెప్పారు.
చైనాకు స్నేహ హస్తం ఇవ్వడమే మంచిది
ఇదిలా ఉంటే చైనా ఆర్థిక వ్యవస్థకు భారత్, జపాన్లు గట్టి పోటీనిస్తాయని డ్రాగన్ కంట్రీ భావిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం చైనా విషయంలో ఈ రెండు దేశాలు చాలా జాగ్రత్తతో వ్యవహరించనున్నాయి. రెండు దేశాలు చైనాతో స్నేహసంబంధాలు నడిపేందుకే ప్రాధాన్యత ఇస్తున్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్దం నడుస్తున్న నేపథ్యంలో చైనాకు భారత్, జపాన్ లాంటి దేశాలు తోడైతే పరిస్థితి మరింత మారుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే జపాన్ భారత్లపై కూడా అమెరికా ఆంక్షలు విధిస్తోంది. ఇక అమెరికా మిత్రదేశాలు ఈ విషయాన్ని గ్రహించి తప్పకుండా మరో ప్రత్యామ్నాయాన్ని ముందుగానే ఎంచుకుంటే అమెరికా నుంచి ముప్పు వాటిల్లిన సమయంలో ఇటు వైపు మొగ్గు చూపేందుకు ఆస్కారం ఉంటుంది. తద్వారా అమెరికాను అంతర్జాతీయంగా ఒంటరి దేశాన్ని చేయొచ్చని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.