చైనా పీస్... మేడిన్ పాకిస్తాన్: ఇదో రకమైన అమ్మాయిల వ్యాపారం, విచారణ చేస్తే!
లాహోర్: పాకిస్తాన్కు చెందిన అమ్మాయిలను చైనాకు అక్రమంగా తరలిస్తున్నట్లు పాక్ విచారణా అధికారులు వెలుగులోకి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు 600కు పైగా అమ్మాయిలను చైనాకు తరలించి... వ్యభిచార కూపంలోకి దించడం లేదా అక్కడి ధనవంతులకు ఇచ్చి పెళ్లి చేయడం లాంటివి కొందరు అక్రమార్కులు చేస్తున్నారని పాక్ విచారణ సంస్థలు పసిగట్టాయి. గత రెండేళ్లలో 629 మంది పాకిస్తాన్ అమ్మాయిలను వీరు అక్రమరవాణా చేసినట్లు సమాచారం.
అమ్మాయిల అక్రమ రవాణా
పాకిస్తాన్ చైనాల మధ్య మంచి సఖ్యత ఉంది. కానీ పాకిస్తాన్ నుంచి అమ్మాయిలను కిడ్నాప్ చేసి లేక బలవంతంపెట్టి చైనాలోని వ్యక్తులకు విక్రయిస్తుండటం కలవరపాటుకు గురిచేస్తోంది. కొంత మంది అమ్మాయిలను అక్రమంగా రవాణా చేస్తే మరికొంత మంది అమ్మాయిలను సొంత కుటుంబ సభ్యులే డబ్బుల కోసం చైనా వ్యక్తులకు ఇచ్చి పెళ్లి చేస్తున్నట్లు పాకిస్తాన్ అధికారుల విచారణలో వెల్లడైంది. ఈ రాకెట్ పెద్దదిగా తయారవుతోందని అయితే దీనిపై ఎవరూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఓ విచారణాధికారి తెలిపారు.
విచారణకు అడ్డొస్తున్న సత్సంబంధాలు
పాకిస్తాన్ నుంచి అమ్మాయిలను అక్రమంగా తరలిస్తున్నారన్న విషయం జూన్ నెలలోనే బయటపడినప్పటికీ... ఈ రెండు దేశాల మధ్య ఉన్న మంచి సంబంధాలు దెబ్బతింటాయన్న ఉద్దేశంతో రెండు దేశాల ప్రభుత్వాలు సైలెంట్గా ఉన్నాయి. ఇదిలా ఉంటే అక్టోబర్లో ఫైసలాబాద్ కోర్టు జడ్జి అమ్మాయిల అక్రమ రవాణా వ్యవహారంతో ముడిపడి ఉన్న 31 మంది చైనా దేశీయులను దోషులుగా తేల్చారు.మరోవైపు దీనిపై విచారణ చేయడం నిలిపివేయాలని స్వయంగా పాకిస్తాన్ ప్రభుత్వమే ఆదేశాలు ఇచ్చినట్లు సల్మాన్ ఇక్బాల్ అనే సామాజిక కార్యకర్త చెప్పారు. అంతేకాదు దీనికి సంబంధించి కథనాలను ప్రసారం చేయరాదని పాక్ మీడియాపై ఇమ్రాన్ ఖాన్ సర్కార్ ఆంక్షలు విధించినట్లు సమాచారం.
పాకిస్తాన్ క్రిస్టియన్ అమ్మాయిలే టార్గెట్
ఇక విచారణలో భాగంగా పాకిస్తాన్ క్రిస్టియన్ వర్గానికి చెందిన మహిళలు యువతులే ఎక్కువగా చైనాకు అక్రమంగా రవాణా అయ్యారని సమాచారం. ముస్లిం మెజార్టీ దేశంగా ఉన్న పాకిస్తాన్లో క్రైస్తవులు మైనార్టీలుగా ఉన్నారు. అంతేకాదు వీరు ఆ దేశంలో అత్యంత దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. పేదరికం వీరికి శాపంగా మారడంతో కొందరు తల్లిదండ్రులే డబ్బుల కోసం అమ్మాయికి ఇష్టం లేనప్పటికీ బలవంతం చేసి చైనా దేశీయులకు ఇచ్చి పెళ్లి చేస్తున్నట్లు విచారణాధికారి తెలిపారు.ఇక పెళ్లి చేసుకుని చైనాకు చేరుకోగానే అక్కడ యువతులు ఒంటరి జీవితంను గడుపుతున్నట్లు సమాచారం. భాషతో ఇబ్బంది పడుతుండగా కనీసం ఒక్క గ్లాసు మంచి నీళ్లు అడిగేందుకు కూడా ట్రాన్స్లేషన్ యాప్స్ పై ఆధారపడాల్సి వస్తుందన్నారు.
వ్యభిచారంలోకి దించుతున్నారంటూ ఆవేదన
ఇక అక్రమంగా రవాణా చేయబడ్డ యువతులు తమ కష్టాన్ని చెప్పుకున్నారు. చైనాలో తాము ఒంటరి జీవితం అనుభవిస్తున్నామని చెప్పారు. అంతేకాదు బలవంతంగా ఫర్టిలిటీ ట్రీట్మెంట్ చేస్తున్నారని, మానసికంగా లైంగికంగా వేధిస్తున్నారని వాపోయారు. కొన్నిసార్లు బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారని ఏకరువు పెట్టినట్లు విచారణాధికారులు తెలిపారు. అంతేకాదు మహిళల శరీరాల నుంచి కొన్ని విడిభాగాలు తీసి వాటిని చైనాకు పంపుతున్నారని యువతులు ఆరోపించినట్లు విచారణాధికారులు తెలిపారు. ఇక ఈ మొత్తం వ్యవహారంలో పాకిస్తాన్ చైనాలకు చెందిన బ్రోకర్లున్నారని చెప్పారు. వీరితో పాటు క్రిస్టియన్ పాస్టర్లు కొందరు డబ్బులకు ఆశపడి పాకిస్తాన్లోని క్రిస్టియన్ కుటుంబాలకు చెందిన అమ్మాయిలను చైనా వారికి అమ్మాల్సిందిగా తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని చెప్పారు.
సొమ్ము చేసుకుంటున్న బ్రోకర్లు..కుటుంబానికి రెండు లక్షలే
ఇదిలా ఉంటే అమ్మాయిలను అక్రమంగా రవాణాచేసే చైనా పాకిస్తాన్ బ్రోకర్లు మాత్రం నాలుగు మిలియన్ నుంచి 10 మిలియన్ రూపాయల వరకు డబ్బులు సంపాదిస్తుండగా బాధితుల కుటంబ సభ్యులకు మాత్రం రెండు లక్షల రూపాయలు ఇస్తున్నట్లు తమ విచారణలో వెల్లడైందని విచారణాధికారులు వెల్లడించారు. అయితే రెండు దేశాల అధికారులు మాత్రం ఇలాంటిదేమీ జరగడం లేదని బుకాయిస్తున్నాయి.