పాక్ ఆర్మీకి నవాజ్ షరీఫ్ వార్నింగ్: చేసింది చాలు మూసుకోండి !
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: దశాభ్ధాలుగా ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ వచ్చిన పాకిస్ధాన్ కు ఇప్పటికి బుద్ది వచ్చింది. ఉగ్రవాదం విషయంలో అంతర్జాతీయంగా ఏకాకిగా మిగిలిపోయిన పాకిస్థాన్ ఎట్టకేలకు దిగివచ్చి చర్యలకు ఉపక్రమించినట్లు కనిపిస్తోంది.
ఇప్పటికే అంతర్జాతీయంగా ఏకాకిగా మిగిలిపోయామని, పాక్ భూభాగంలో ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాల్సిందేనని పాకిస్థాన్ సైన్యానికి ఆదేశ ప్రధాని నవాజ్ షరీఫ్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
ముంబై దాడుల కేసు విచారణ తిరగదొడాలని, పఠాన్ కోట్ ఉగ్రదాడి కేసు వేగవంతం చెయ్యాలని నవాజ్ షరీఫ్ సైన్యానికి తేల్చి చెప్పారని పాకిస్థాన్ లోని ప్రముఖ పత్రిక డాన్ గురువారం వెల్లడించింది.
భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఇటీవల ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో పాక్ ప్రభుత్వానికి-సైన్యానికి మధ్య కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే పాక్ ప్రభుత్వం ఆదేశ సైన్యానికి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసిందని డాన్ ప్రతిక వెల్లడించింది.
కీలకాంశాల్లో సైన్యం ప్రభుత్వానికి అనుకూలంగా నడుచుకోవాలని, నిషేదిత ఉగ్రవాద గ్రూప్ ల మీద చర్యలు తీసుకోవాలని నవాజ్ షరీఫ్ స్పష్టం చేశారని డాన్ పత్రిక తెలిపింది. ముంబై దాడుల కేసు సైతం పునర్విచారణ చెయ్యడానికి సిద్దం కావాలని సూచించారు.
అదుపులో లేని, నిషేదిత మిలిటెంట్ గ్రూప్ లపై లా ఎన్ ఫోర్స్ మెంట్ చర్యలు తీసుకుంటే అందులో సైనిక నిఘా ఏజెన్సీలు జోక్యం చేసుకోకూడదని గట్టి సందేశాన్ని ఇస్తూ సైన్యానికి హెచ్చరికలు జారీ చేశారని డాన్ పత్రిక తెలిపింది.
ఈ సందేశాన్ని సైనిక, నిఘా వర్గాలకు అందజేయడానికి ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రిజ్వాన్ అఖ్ఖర్, పాక్ జాతీయ భద్రతా సలహాదారు నజర్ జుంజువా పాక్ లోని నాలుగు ప్రావిన్సుల్లో పర్యటించనున్నారని డాన్ పత్రిక వెల్లడించింది.
ఊరీ ఉగ్రదాడి తరువాత పాక్ అక్రమిత కాశ్మీర్ లో భారత ఆర్మీ సర్జికల్ స్ట్రైక్ దాడులు చేశాయి. తరువాత బారత్ తో సహ శ్రీలంక, భూటాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, మాల్ధీవులు సార్క్ సమ్మిట్ సమావేశాలు బహిష్కరించాయి. పాక్ ప్రస్తుతం ఏకాకి అయ్యింది. ఇప్పుడు నవాజ్ షరీఫ్ కు బుద్దిరావడంతో చర్యలకు ఉపక్రమించారు.