గాంధీజీ షాకయ్యేవారు: భారత్లో మతంపై ఒబామా, ఇస్లాంకే కాదు క్రైస్తవంలోను
వాషింగ్టన్: భారత దేశంలో ఇప్పుడు ఉన్న మత అసహనాన్ని చూసి ఉంటే జాతిపిత మహాత్మా గాంధీ దిగ్భ్రాంతి చెంది ఉండేవారని అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా గురువారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్నేళ్లుగా భారత్లో అన్ని రకాల మత విశ్వాసాలు ఎదుర్కొన్న అసహన చర్యలను గాంధీ చూసి ఉంటే జీర్ణించుకోకపోయి ఉండేవారని అభిప్రాయపడ్డారు.
ఇటీవల భారత పర్యటన సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన సభలో మత సహనంపై తాను చేసిన వ్యాఖ్యలు అధికార భారతీయ జనతా పార్టీని ఉద్దేశించినవేననే విమర్శలు కొన్ని భారత రాజకీయ పార్టీలు చేశాయి. దీనికి వైట్ హౌస్ రెండు రోజుల క్రితం స్పందించింది. ఒబామా చేసిన వ్యాఖ్యలు బీజేపీని ఉద్దేశించి కాదని పేర్కొంది. అనంతరం ఒబామా మరుసటి రోజు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత పర్యటనకు వచ్చి వెళ్తూ ఆఖరు రోజున మత సహనం గురించి మాట్లాడిన అగ్రరాజ్యాధిపతి మరోసారి ఆ అంశంపై వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గురువారం వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో జరిగిన నేషనల్ ప్రేయర్ బ్రేక్ఫాస్ట్లో ప్రసంగించిన ఒబామా పెరుగుతున్న మత అసహనం గురించి ప్రస్తావిస్తూ భారత్ను ఉదాహరిస్తూ ఇలా వ్యాఖ్యానించారు.
భారత్ను అద్భుతమైన, అందమైన, ఘనమైన భిన్నత్వం కలిగిన దేశం అని పేర్కొన్నారు. అయితే, గత కొద్ది సంవత్సరాలుగా అక్కడ అన్ని మతాలూ ఇతర మతాలవారికి లక్ష్యంగా మారాయన్నారు. మతంపై విశ్వాసం ప్రజలతో మంచి చేయిస్తుందని, అదే సమయంలో అదో ఆయుధంలా మారుతుందని అభిప్రాయపడ్డారు.
మత అసహనం ఏ ఒక్క మతానికో, జాతికో చెందినది మాత్రమే కాదని, అందరిలోనూ ఉందన్నారు. మతం పేరిట జరిగే హింస ఇస్లాంకు మాత్రమే పరిమితం కాదన్నారు. క్రైస్తవంలోనూ ఉందని వ్యాఖ్యానించారు. క్రూసేడులు, ఇంక్విజిషన్ పేరిట జరిగిన హింసను ఈ సందర్భంగా ఒబామా గుర్తు చేశారు.
మతం మంచికే అయినా కొందరు తాము చేసే ఘాతుకాల కోసం మతాన్ని హైజాక్ చేస్తారన్నారు. ఈ మత అసహనం మత విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇస్లాం కోసం యుద్ధం చేస్తున్నామనుకుంటున్న ఐఎస్ఐఎస్ నిజానికి ఇస్లాంను మోసం చేస్తోందన్నారు. ఈ సభకు హాజరైన టిబెట్ మత గురువు దలైలామాను ఒబామా.. మంచి స్నేహితుడుగా అభివర్ణించారు.