భారత్కు థ్యాంక్స్ చెప్పకుండా: పాక్కు అద్నాన్ షాక్, 'పాకిస్తానీ అయి ఉండి'
న్యూఢిల్లీ: పాకిస్తాన్లు పుట్టి, భారత దేశంలో స్థిరపడిన ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ భారత ఆర్మీ సర్జికల్ స్ట్రయిక్ దాడి పైన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో స్పందించారు. ఉగ్రవాదులను మట్టుబెట్టినందుకు భారత్కు పాక్ సైన్యం థ్యాంక్స్ చెప్పాలన్నారు.
యూరి ఉగ్రదాడి బాధాకరమన్నారు. భారత బలగాలు పాక్పై సర్జికల్ స్ట్రయిక్స్ జరిపి ఉగ్రశిబిరాలను మట్టుబెట్టడం గొప్ప విజయమని ఇదివరకే చెప్పారు. సర్జికల్ స్ట్రయిక్ పైన ప్రధాని నరేంద్ర మోడీని సైతం ఆయన ప్రశంసించారు.
తాజాగా ఆయన ఉగ్రవాదులను హతమార్చినందుకు పాక్ భారత్కి ధన్యవాదాలు చెప్పాలన్నారు. దాంతో పాకిస్థాన్కి చెందిన వ్యక్తి అయి ఉండి దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న ద్రోహి అంటూ అద్నాన్ సామిని పలువురు విమర్శించారు.
అయినా అద్నాన్ అవేవీ పట్టించుకోకుండా భారత ఆర్మీ విజయవంతంగా దాడులు జరిపి ఉగ్రవాదులను మట్టుపెట్టినందుకు పాకిస్థాన్ భారత్కు ధన్యవాదాలు చెప్పాలని ఓ కార్యక్రమంలో చెప్పారు. ఇరు దేశాలనే కాకుండా యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తూ అందరి శతృవుగా మారిన ఉగ్రవాదాన్నే తాను వ్యతిరేకిస్తున్నానన్నారు.
తాము కూడా ఉగ్రబాధితులమేనంటూ పాకిస్తాన్ కొన్నేళ్లుగా చెప్తోందని, అలాంటప్పుడు ఆ ఉగ్రవాదులను హతమార్చి పొరుగు దేశం సాయం చేస్తోంటే దానిని గుర్తించకపోతే ఎలా అని ప్రశ్నించారు. తాను దేవుడికి తప్ప ఎవరికీ భయపడనని చెప్పారు. తన నుదుడి పైన రాసుంటే ఇలా కామెంట్ చేసిన తర్వాత తాను పాకిస్తాన్ వెళ్లాల్సి రావొచ్చని, అలా వెళ్లడానికి కూడా భయపడనని చెప్పారు.