9మంది అమాయకులు బలి: ఆఫ్గన్ సైన్యం కాల్పులు, విచారణకు గవర్నర్ ఆదేశం!
కాబూల్: అఫ్గనిస్థాన్ భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో 9మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఐసిస్ సహా మరికొంతమంది ఉగ్రవాదులు నాంగర్హర్ ప్రావిన్స్లోని ఓ శిబిరంలో ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి.
సోమవారం రాత్రి చపార్హర్ జిల్లాలో జరిపిన ఈ కాల్పుల్లో తొమ్మిది మంది అమాయకులు చనిపోయారు. ఉగ్రవాదులు అనుకుని సామాన్యులపై భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో ఈ ఘోరం చోటు చేసుకుంది. మృతుల్లో స్థానిక పోలీసు కమాండర్ కూడా ఉండటం గమనార్హం.
ఘటనపై గవర్నర్ హయతుల్లా హయత్ స్పందించారు. భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టిన ఇంటి నుంచి కాల్పుల శబ్దం వినిపించిందని, అనంతరం అక్కడికి వెళ్లి చూస్తే చనిపోయినవాళ్లంతా సామన్యులేనని వెల్లడించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశిస్తున్నట్టు చెప్పారు.
కాబూల్ లో పేలుడు ఘటన:
ఆఫ్గన్ రాజధాని కాబూల్ లో బాంబు పేలుడు చోటు చేసుకుంది. సైకిల్ కు అమర్చిన బాంబు పేలడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం ఖరాబాగ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లా గవర్నర్ మహమ్మద్ అజీం ఈ విషయాన్ని ధ్రువీకరించారు. దాడిలో మరో నలుగురు సామాన్యులతో పాటు ముగ్గురు పోలీసులు చనిపోయినట్టు తెలిపారు.