ఏడాది పాటు తాలిబన్ల చెరలో: భారత ఇంజినీర్ల కోసం ఫలించిన అమెరికా దౌత్యం
ఇస్లామాబాద్: కరడు గట్టిన మత ఛాంందసవాద సంస్థ తాలిబన్ల చెరలో ఏడాది పాటు మగ్గిన ముగ్గురు భారత ఇంజినీర్లకు ఎట్టకేలకు విముక్తి లభించింది. ఆ ముగ్గురూ బంధ విముక్తులయ్యారు. ఖైదీల పరస్పర మార్పిడిలో భాగంగా- తాలిబన్లు తమ చెరలో ఉన్న ముగ్గురు భారత ఇంజినీర్లను విడిచి పెట్టారు. దీనికోసం అమెరికా పెద్ద ఎత్తన కసరత్తు చేయడం, ఎత్తుగడలను రూపొందించడం ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ అంశం. తాము భారత ఇంజినీర్లను విడిచి పెట్టినట్లు తాలిబన్లు ధృవీకరించారు. ఖైదీల పరస్పర మార్పిడిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
ఆఫ్ఘనిస్తాన్ లో రోడ్ల నిర్మాణ పనుల కాంట్రాక్టును పొందిన భారతీయ కంపెనీలో ఈ ముగ్గురు పని చేస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా తోటి ఉద్యోగులతో కలిసి రెండేళ్లుగా వారు ఆఫ్ఘన్ లో ఉంటున్నారు. రోడ్ల నిర్మాణ పనులను వ్యతిరేకిస్తోన్న తాలిబన్లు గత ఏడాది బాగ్లాన్ ప్రావిన్స్ లో మొత్తం ఏడుమంది భారత ఇంజినీర్లను అపహరించారు. కాందహార్ లోని తమ ప్రధాన కేంద్రంలో బందీలుగా ఉంచారు. అప్పటి నుంచీ వారి జాడ తెలియరాలేదు. వారిని విడిపించడానికి కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ తీసుకున్న చర్యలేవీ ఫలించలేదు. పైగా పరిస్థితులు మరింత వికటించాయి.
వారిని విడుదల చేయడానికి అమెరికా రాయబార కార్యాలయం రంగంలోకి దిగింది. అమెరికా ప్రత్యేక దౌత్య సంబంధాల అధికారి జల్మే ఖలీల్జద్ నేతృత్వంలో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో పలుమార్లు చర్చలు కొనసాగించారు. ప్రస్తుతం పాకిస్తాన్ కారాగారాంలో ఉన్న తమ ముగ్గురు కీలక నాయకులను విడిచి పెడితే.. ముగ్గురు భారత ఇంజినీర్లను విముక్తులను చేస్తామంటూ షరతులు విధించారు. ఈ ప్రతిపాదనలపై అంగీకారం వ్యక్తమైంది. షేక్ అబ్దుల్ రహీమ్, మౌల్వీ అబ్దుర్ రషీద్ సహా మరో నాయకుడిని విడిపించాలనే షరతు మీద ఏడుమంది భారతీయ ఇంజినీర్లలో ముగ్గురిని విడిచి పెట్టారు తాలిబన్లు.